షాక్: కన్న కూతుళ్లనే అమ్మేసిన తండ్రులు, రంగంలోకి షీ టీం
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా ఆందోళనకర అంశంగా మారుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతుండగా, ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా, ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు తండ్రులు వారి కన్న కూతుళ్లనే అక్రమంగా అమ్మకానికి పెట్టడం గమనార్హం. పక్కా సమాచారంతో షీ టీమ్ వారి పని పట్టింది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీకి చెందిన రవి, దశరథ్లు తమ కుమార్తెలను రాజస్థాన్కు చెందిన భజరంగీకి విక్రయించేందుకు నిర్ణయించారు. లతీఫ్ అనే వ్యక్తి వీరికి మధ్యవర్తిగా వ్యవహరించారు.
మంగళవారం రైల్వేస్టేషన్లో ఇద్దరు బాలికలను అప్పగించి డబ్బులు తీసుకునే సమయంలో తేడాలు వచ్చాయి. దీంతో వారి మధ్య కొంత ఘర్షన చోటు చేసుకుంది. కాగా, విషయాన్ని గమనించి పక్కనున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అప్రమత్తమైన షీ బృందం సభ్యులు రంగంలోకి దిగారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులందర్నీ పట్టుకుని పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అమ్మకానికి పెట్టిన బాలికల్లో ఒకరికి పన్నెండేళ్లు, మరొకరికి ఎనిమిదేళ్లు ఉండటం గమనార్హం.
ప్రస్తుతం ముఠా నుంచి రక్షించిన అమ్మాయిలిద్దరినీ బాలసదన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత... మరోసారి ఇలాంటి పనులకు పాల్పడమని లిఖిత పూర్వక హామీ ఇస్తేనే పిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్సై రాజన్న తెలిపారు. కాగా, మానవ అక్రమ రవాణాలో అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు తర్వాత 561 కేసులతో టాప్-5లో ఉండటం విచారకరం.