భార్యను చంపి ఆత్మహత్య: భార్యను కత్తితో పొడిచి ఉరేసుకున్నాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు సంఘటనల్లో భర్తలు భార్యలపై దాడి చేశారు. ఆ తర్వాత భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓ ఘటనలో భార్య మరణించగా, మరో ఘటనలో భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం అడవిపదిరలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కర్రతో కొట్టి చంపాడు. అనంతరం భర్త పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో భార్యను క్షణికావేశంతో కత్తితో పొడిచి చంపిన భర్త ఆ తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలో సోమవారం తెల్లవారు జామును చోటు చేసుకుంది.
వెంకట్ రెడ్డి (70), పద్మ దంపతులు కుమారుడు, కోడుల, కూతుళ్లతో వ్యవసాయం చేసుకుంటూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో వెంకట్ రెడ్డి ఇంట్లోనే ఉన్న కత్తితో భార్యను విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డువచ్చిన కూతురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తీవ్రంగా గాయపడిన పద్మను భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే పరారైన వెంకట్ రెడ్డి తెల్లవారేసరికి ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. పద్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
తల్లీకొడుకుల ఆత్మహత్య
వరంగల్ జిల్లాలోని చేర్యాల మండలం తపాస్పల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తపాస్పల్లి జలాశయంలో పడి తల్లీ, కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను చేర్యాల వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.