మోసపోయిన భర్త: ఆస్తి కోసం భార్య ఇంటి ముందు ఆమరణ దీక్ష
హైదరాబాద్: కట్నం తీసుకుని భర్త వేధిస్తున్నాడంటూ ఆందోళన చేసిన మహిళలను చూశాం. కానీ తొలిసారిగా భార్యే తన ఆస్తులను తీసుకుందని ఆరోపిస్తూ ఓ భర్త ఆందోళనకు దిగాడు. అంతేకాదు తన డబ్బు తనకు ఇప్పించాలంటూ భార్య చేతిలో మోసపోయిన ఓ భర్త... భార్య ఇంటి ముందే ఆమరణ దీక్షకు దిగాడు.
వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రమేశ్ చంద్ర(51), అదే జిల్లా వీర్లపాడు మండలం నందలూరి గ్రామానికి చెందిన శైలజ(40)కు 1991లో వివాహమైంది. హైదరాబాద్లో ఉంటున్న వీరికి ఇద్దరు కుమారులున్నారు.
కుటుంబ కలహాలతో భార్యభర్తలు మూడేళ్ల నుంచి వేరు వేరుగా ఉంటున్నారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులతో పాటు చిట్ఫండ్ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో రమేశ్ చంద్ర నగరంలోని పలుచోట్ల భవాలను, ప్లాట్స్ కొన్నాడు. వాటిని భార్య శైలజ పేరు పెట్టాడు.
గత ఇరవై ఏళ్లుగా వారి సంసారం సాఫీగానే జరిగింది. అయితే ఇటీవల వ్యాపారంలో నష్టం రావడంతో ఆస్తులను తనకివ్వాలని భార్యను కోరాడు. కానీ భార్య శైలజ భర్త సంపాదించిన ఆస్తిన కాజేసి రోడ్డున పడేసింది. దీంతో భర్త రమేష్ చంద్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో కూకట్ పల్లిలో శైలజ ఉంటున్న ఇంటి ఎదటు తల్లి లక్ష్మీ, అప్పిచ్చిన వారితో కలిసి రమేశ్ చంద్ర మంగళవారం దీక్షకు దిగాడు. భార్య పేరుపై పెట్టిన ఆస్తుల్లో పావు వంతు వాటా ఇస్తే అప్పులు తీర్చుుకుంటానని విజ్ఞప్తి చేశాడు. అయితే అందుకు భార్య అంగీకరించలేదు.
భార్య ఆమరణ దీక్షకు దిగిన విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రమేశ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రమేశ్ చంద్ర తనన్ని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.