ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, కూతురు పుట్టాక ఏం చేశాడంటే
భార్య పిల్లలను పోషించకుండా, వేధించడం ప్రారంభించాడు, తల్లిదండ్రులకు దూరమై భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత కూతురుతో సహ ఆత్మహత్యకు పాల్పడింది
శ్రీరాంపూర్ :ప్రేమించాడు , పెళ్ళి చేసుకొన్నాడు, కొంత కాలం బాగానే ఉన్నారు. భార్య పిల్లలను పోషించకుండా, వేధించడం ప్రారంభించాడు, తల్లిదండ్రులకు దూరమై భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత కూతురుతో సహ ఆత్మహత్యకు పాల్పడింది.
శ్రీరాంపూర్ కు సమీపంలోని సస్పూర్ మండలంలోని సీసీసీ లక్ష్మీనగర్ కు చెందిన శంకరయ్య , అమృత దంపతుల కుమారుడు రాజేందర్ , అంకం కాంతయ్య, సత్వవతి దంపతుల కూతురు రాగిణిని నాలుగేళ్ళ క్రితం ప్రేమించి వివాహం చేసుకొన్నాడు.
వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు . వేర్వేరు కులాలకు చెందిన వారైనందున ఇరు కుటుంబాలవారు ఒప్పుకోలేదు. వివాహమైన తర్వాత రాజేందర్ , రాగిణిలు వేరు కాపురం పెట్టారు.రాజేందర్ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి పాప పుట్టింది. ఆమెకు 11 మాసాలు.
రాజేందర్ కొంత కాలంగా పనికి పోవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.రాగిణి పై రాజేందర్ వేధింపులు కూడ ఎక్కువయ్యాయి.ఈ బాధలు తట్టుకోలేదక రాగిణి సోమవారం నాడు తన కూతురుతోసహా కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొంది.స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.
అత్తింటివారే హత్య చేశారు
రాజేందర్ తో వివాహం జరిగిన తర్వాత రాగిణితో తమకు సంబంధాలు తెగిపోయాయని ఆమె సోదరుడు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను ఆదుకోవాలని స్నేహితుల ద్వారా వర్తమానం పంపిందని సోదరుడు చెప్పారు. పుట్టింటి నుండి డబ్బులు తేవాలంటూ అత్తింటివారే రాగిణిని హత్య చేశారని రాగిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.