భార్యను బెల్టుతో గొంతు నులిమి చంపాడు
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన రేణుక (26), కృష్ణా జిల్లా నూజివీడులోని కొత్తపేటకు చెందిన ప్రసాద్ (30) కొద్ది సంవత్సరాల క్రితం ఓల్డ్ మలక్పేట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కలిసి చదివారు. ఆ సమయంలో ప్రేమించుకున్న వారు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ప్రసాద్ బ్యాంక్లోన్ ప్రాసెసింగ్ ఉద్యోగం చేస్తుండగా, రేణుక ఇంటి వద్దనే ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రేణుక సోదరుడు వెంకటేష్ కూడా వీరితోనే ఉంటున్నాడు.
దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రసాద్ వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆ క్రమంలోనే గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. మంగళవారం ఉదయం బ్యాంక్ లోన్కు సంబంధించిన పత్రాలు ఇచ్చి రావాల్సిందిగా ప్రసాద్ బావమరిది వెంకటేష్ను కూకట్పల్లికి పంపించాడు. అనంతరం తన ఇంటికి వచ్చిన సోదరి జ్యోతికి ప్రసాద్ డబ్బులిచ్చి పంపాడు. అప్పటికే దంపతుల మధ్య గొడవ జరుగుతుంది.
ప్రసాద్ సోదరికి డబ్బులు ఇవ్వడం రేణుకకు నచ్చలేదు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో ప్రసాద్ భార్యను తీవ్రంగా కొట్టాడు. ఆవేశంలో బెల్టుతో ఆమె గొంతు నులిమి మంచంపై పడేశాడు. ఆమెపై దుప్పటి కప్పి బయటకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేష్ మంచంపై రేణుక అపస్మారకస్థితిలో పడి ఉండడం గమనించి బావకు ఫోన్ చేసి చెప్పాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా ప్రసాద్ అతడికి సూచించాడు. పక్కింటి వారి సహాయంతో వెంకటేష్ కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే రేణుక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇంతలో ఆస్పత్రి వద్దకు వచ్చిన ప్రసాద్ తాను బయటకు వెళ్లేప్పుడు ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని, అందువల్లే మృతి చెంది ఉంటుందంటూ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. రేణుక తల్లిదండ్రులు హుటాహుటిన నగరానికి వచ్చారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామం తీసుకువెళ్లారు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న సమయంలో గొంతుపై కమిలిన గాయాలు కనిపించాయి. అత్తింటి వారే హతమార్చారంటూ వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు చేయాలని వారు సూచించడంతో బుధవారం ఉదయం మృతదేహాన్ని తీసుకుని నగరానికి వచ్చి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు నిలదీస్తున్న తమ బిడ్డను ప్రసాద్, అతని సోదరి జ్యోతి కలిసి గొంతు నులిమి హతమార్చారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వారు చెప్పారు.