షాక్: రూ.3లక్షలకే అద్దె గర్బాలు, సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ సీజ్
నిబంధనలకు విరుద్దంగా హైద్రాబాద్ లోని సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్లో అద్దె గర్భాల దందా సాగినట్టు అధికారుల విచారణలో తేలింది.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్దంగా హైద్రాబాద్ లోని సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్లో అద్దె గర్భాల దందా సాగినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ కేంద్రంపై విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు నమ్మలేని వాస్తవాలను తెలుసుకొని విస్తుపోయారు.
హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 14 లోని సాయికిరణ్ ఇన్ ఫెర్టిటిలిటీ సెంటర్ లో ఐదేళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా అద్దె గర్భాల దందా సాగుతోందని అధికారులు నిర్దారణకు వచ్చారు.
ఐదేళ్ళుగా ఎవరికీ అనుమానం రాకుండానే ఈ ఆసుపత్రి యాజమాన్యం ఈ తతంగాన్ని నిర్వహించింది. హైద్రాబాద్ లో కేవలం మూడు సరోగసీ సెంటర్లకు మాత్రమే అనుమతి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా సాయికిరణ్ ఆసుపత్రి యాజమాన్యం సరోగసీ విధానానికి తెరతీసిందని అధికారులు తేల్చారు.
ఈ కేసు విచారణలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెల్లడి అవుతున్నాయని వైద్యాశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం నాడు సాయికిరణ్ ఆసుపత్రి వ్యవహరం వెలుగుచూసింది. దీంతో సాయికిరణ్ ఆసుపత్రిలోనే ఇలా నిర్వహిస్తున్నారా లేక ఇతర ఆసుపత్రులు కూడ ఇదే తరహలో వ్యవహరిస్తున్నాయా అనే కోణంలో కూడ విచారణ చేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.
రెండున్నర లక్షలకు అద్దెగర్భం
సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ లో ఐదేళ్ళుగా కొనసాగుతున్న అద్దెగర్బాలకు సంబంధించిన విషయం రెండు రోజుల క్రితం వెలుగుచూసింది. ఈ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్దంగా సరోగసీ నిర్వహిస్తున్నారని వైద్యశాఖాధికారులు గుర్తించారు. రెండున్నర లక్షలను ఇస్తామని చెప్పి తమను తీసుకువచ్చారని కొందరు మహిళలు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ, నేపాల్ నుండి వారిని తెచ్చారని అధికారులు గుర్తించారు. సరోగసీ కోసం వచ్చే మహిళలకు, పిల్లల్ని పొందేవారికి , ఆసుపత్రి యాజమాన్యానికి మధ్య అవగాహన ఒప్పందం ఉంటుందని అధికారులు అంటున్నారు.
వాణిజ్య సరోగసీకి అనుమతి లేదు
నిబంధనల ప్రకారంగా వాణిజ్య సరోగసీలు నిషిద్దం. ప్రస్తుతం సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ లో 48 మహిళలు అద్దె గర్బాలను మోస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిజానికి సరోగసీ కేంద్రం నిర్వహించాలంటే ఆర్టిఫీషియల్ రీప్రొడక్షణ్ థెరపీ(ఏఆర్టీ) కింద వైద్య,ఆరోగ్యశాఖ నుండి అనుమతులు తీసుకోవాలి. కానీ, సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ కు ఎలాంటి అనుమతులు లేవు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదేళ్ళుగా యధేచ్చగా ఈ సెంటర్ సరోగసీ విధానం ద్వారా పిల్లలకు జన్మనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది.
సాయికిరణ్ ఇన్ పెర్టిలిటీ సెంటర్ పై కేసులు
ఐదేళ్ళుగా సాయికిరణ్ ఆసుపత్రిలో సరోగసీ విధానం కొనసాగించడం, అధికారులకు ఈ విషయం తెలియదని ప్రకటించడం పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హైద్రాబాద్ చుట్టుపక్కల వారే కాకుండా ఢిల్లీ, నేపాల్ నుండి వచ్చినవారు కూడ గర్బాన్ని అద్దెకిస్తున్నారు. ఈ మేరకు రెండున్నరలక్షలను తీసుకొంటున్నారని అధికారులు గుర్తించారు. సాయికిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ పై కేసు నమోదు చేస్తామని హైద్రాబాద్ జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పద్మజ చెప్పారు.అయితే ఆసుపత్రిని జప్తుచేసే అవకాశమున్నా...ప్రస్తుతం అక్కడ గర్బాలు మోస్తున్నవారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలను తీసుకొంటామన్నారు. గర్భం దాల్చిన మహిళల్ని ఆసుపత్రిలోనే ఉంచడం నిబంధనలకు విరుద్దం, ఈ అంశాలన్నింటిని ముందస్తు గర్భధారణ, జన్మ నిర్ధారణ సాంకేతిక సలహ మండలికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు.
ఆసుపత్రి సీజ్
అద్దె గర్భంతో పిల్లలకు జన్మనిచ్చేందుకు సహకరిస్తున్న బంజారాహిల్స్ లోని సాయికిరణ్ ఆసుపత్రిపై వైద్యాధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక ఫైళ్ళను స్వాధీనం చేసుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు. పేద మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొన్న ఆసుపత్రి యాజమాన్యం అద్దె గర్భంతో పిల్లలకు జన్మనిస్తే డబ్బులిస్తామని ఆశచూపుతున్నారు. ప్రసవమయ్యేవరకు ఆసుపత్రిలోనే గృహనిర్భంధం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరిని రెండు మూడు సార్లు అద్దె గర్బానికి ఉపయోగించుకొంటూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అధికారులు అంటున్నారు.