న్యూయార్క్ సంస్థ-క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ ఫస్ట్: కేసీఆర్ ప్రశంస
భారత దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలవడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్: భారత దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలవడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్ మహానగరం ఉన్నత శ్రేణి జీవన ప్రమాణాలను కలిగి ఉండటంతో పాటు శాంతియుత జీవనానికి, అతి తక్కువ కాలుష్యానికి, ఉత్తమ విద్యాసంస్థలకు పేరెన్నిక కావడంతో భారతదేశంలో హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఎంపికైందన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు తదితర సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూయార్క్ పట్టణానికి చెందిన మెర్సర్ సంస్థ 2016 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగ్ వివరాలను విడుదల చేసిన సందర్భంలో హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమ నగరంగా పేర్కొంది. సామాన్య ప్రజల భద్రత, వారికి కల్పించిన సురక్షిత వాతావరణం ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చన్నారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది.
మరోవైపు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల వాళ్లు ఉంటారని, సమస్య పరిష్కరించాలని వారే డిమాండ్ చేస్తారని వ్యాఖ్యానించారు. అదే పార్టీకి చెందిన మరికొందరు కోర్టుకు వెళ్లి స్టే తెస్తారని, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేశారని చెప్పారు.
అదే పార్టీకి చెందిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని, దయ చేసి ఆ కేసు విత్ డ్రా చేయించాలని షబ్బీర్ అలీ గారిని కోరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని, ఎవరెన్ని స్టేలు తెచ్చినా బంగారు తెలంగాణను అడ్డుకోలేరన్నారు.