డా.శశికుమార్ ఆత్మహత్యలో ఎన్నో ట్విస్ట్లు: ఎవరీ రామారావు! తెరపైకి 'ప్రియాంక'
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం వైద్యుల కాల్పుల ఘటన కేసులో రామారావు అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ సూసైడ్ నోట్లో, శశికుమార్ ఆరోపిస్తున్న వ్యక్తుల్లో ఈ పేరు వినిపిస్తోంది.
దీంతో ఈ కేసులో రామారావు కీలకం కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్త మరణం వెనుక డాక్టర్ ఉదయ్, సాయికుమార్తో పాటు రామారావు, ఓబుల్ రెడ్డి, కృష్ణ కిషోర్ రెడ్డిల హస్తం ఉందని శశికుమార్ సతీమణి క్రాంతి ఆరోపిస్తున్నారు. శశికుమార్ సూసైడ్ నోట్లోను ఈ పేర్లు ఉన్నాయి.
శశికుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్న నలుగురూ కొన్ని ప్రయివేటు ఆసుపత్రులలో భాగస్వాములు. వీరిలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామారావు.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వాడు. అతను మోసాలు చేయడంలో ఆరితేరినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
నల్గొండ జిల్లా యువతిని పెళ్లి చేసుకొని హైదరాబాదుకు వచ్చాడు. తొలుత ల్యాబ్ అసిస్టెంటుగా, ఆ తర్వాత కాంపౌండరుగా పని చేశాడు. ఓ మెడికల్ ల్యాబ్లో భాగస్వామిగా చేరి.. ఆసుపత్రుల స్థాయికి విస్తరించాడు. పేరున్న వైద్యులను లక్ష్యంగా చేసుకునేవాడు.
ప్రయివేటు ఆసుపత్రుల భాగస్వామ్యం పేరిట.. నెలకు లక్ష రూపాయలతో డైరెక్టర్ పోస్ట్ అని నమ్మించేవాడని, ఇందుకు పెద్ద మొత్తంలో పదుల సంఖ్యలో వైద్యుల నుంచి డబ్బులు తీసుకునేవాడని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో రామారావుపై చైతన్యపురి పిఎస్లో చెక్ బౌన్సు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, డాక్టర్ల కాల్పుల ఘటనలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు ప్రియాంక. ఆమె ఉదయ్ కుమార్ తరఫున పలువురు ఫైనాన్షియర్ల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
తద్వారా డాక్టర్ల కాల్పుల ఘటనలో కేసు చిక్కుముడులు వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. శశికుమార్ తన సూసైడ్ నోట్లో.. కెకె రెడ్డి, రామారావు, ఓబుల్ రెడ్డి, చిన్నారెడ్డి పేర్లను రాశారు. వారు తనను మోసం చేశారని, శిక్షపడేలా చూడాలన్నారు.
దీంతో వీరికి లారెల్ ఆసుపత్రి వ్యవహారాలతో సంబంధం ఉందని పోలీసులు అనుమానించి లోతుగా ఆరా తీశారు. దిల్సుఖ్ నగర్లోని సిగ్మా ఆసుపత్రికి సంబంధించి మరో వివాదం ఉన్నట్లు బయటపడింది. దీనిని ఇటీవలే శశికుమార్ లీజుకు తీసుకున్నారు. కెకె రెడ్డి వద్ద దీనిని ఆయన లీజుకుతీసుకున్నారని తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి వీరి మధ్య రూ.1.3 కోట్లకు సంబంధించి వివాదం నడుస్తోంది. రామారావు ఈ ఆసుపత్రికి సీఈవోగా వ్యవహరించగా.. చిన్నారెడ్డి ఆసుపత్రి బిల్డింగ్ యజమానిగా తేలింది. ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి శశికుమార్కు పీఏగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ నలుగురిని పోలీసులు విచారించారు.
మిగిలిన ముగ్గురితోను ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. కాల్పులు జరిపిన వ్యక్తి వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి. దీంతో వెనుక సీటులో కూర్చున్నది.. శశికుమారా లేక సాయి కుమారా అని తేల్చేందుకు పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషించారు. వెనుక కూర్చుంది శశిగా నిర్ధారించుకున్నారు.
కాల్పుల చప్పుడు వినిపంచలేదు: వాచ్మెన్
సోమవారం సాయంత్రం చంద్రకళ, శశికుమార్ కారులో వచ్చారని, వారు మామూలుగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన కనిపించలేదని, శశికుమార్ ఇక్కడే ఉండిపోయారని, చంద్రకళ వెళ్లిపోయారని, ఆ తర్వాత తాను వెళ్లి గేటు వద్ద పడుకున్నానని, కానీ తుపాకీతో కాల్చిన చప్పుడు ఏమీ వినిపించలేదని వాచ్మెన్ చెప్పాడు.