దుర్గం చెరువుపై తీగల వంతెన: ఆకర్షణతోపాటు ఐటీ కారిడార్కు రిలీఫ్!
హైదరాబాద్ నగరానికి మరో అదనపు ఆకర్షణ చేరుతోంది. అదే దుర్గం చెరువుపై 1.04 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న వేలాడే(తీగల) వంతెన. ఈ వంతెన నిర్మాణానికి తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం శంకు
హైదరాబాద్: నగరానికి మరో అదనపు ఆకర్షణ చేరుతోంది. అదే దుర్గం చెరువుపై 1.04 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న వేలాడే(తీగల) వంతెన. ఈ వంతెన నిర్మాణానికి తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.3.5కోట్లతో చేపట్టే చెరువు సుందరీకరణ పనులను కూడా మంత్రి ప్రారంభించారు.
ఐటీ కారిడార్కు రిలీఫ్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకే రూ.184 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న తెలిపారు. నగర పర్యాటకానికి దుర్గం చెరువును ప్రత్యేక ఆకర్షణంగా తీర్చిదిద్దుతామన్నారు.
వచ్చే ఏడాది వరకు..
వంతెన నిర్మాణాన్ని 12-14 నెలల్లో పూర్తిచేస్తామన్నారు. ఇదొక లాండ్ మార్క్ గా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తొందన్నారు.
మూడు నిమిషాల్లో హైటెక్ సిటీకి
కాగా, ఈ వంతెన అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి మూడు నిమిషాల వ్యవధిలో హైటెక్సిటీకి చేరుకోవచ్చు. 1.048 మీటర్ల పొడవున నిర్మాణమయ్యే ఈ వంతెన నిర్మాణానికి జీహెచ్ఎంసీ రూ.92కోట్లు, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) రూ.92కోట్లు భరిస్తున్నాయి.
విదేశీ సాంకేతికతతో..
కాగా, ఈ వంతెన నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థ చేపడుతోంది. ప్రీకాస్టింగ్ పద్ధతిలో ఉపయోగించే పిల్లరు, ఇతర సాంకేతిక, యంత్ర పరికరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. అమెరికా, జర్మనీ, స్వీడన్, యూకే తదితర దేశాల్లోని వేలాడే వంతెనల మాదిరిగానే దీన్ని నిర్మించనున్నారు.