మొబైల్ బిల్లు నెలకు రూ. 2 లక్షలు, లబోదిబోమన్న హైదరాబాద్ వాసి
హైదరాబాద్: సాధారణంగా నెలకు రూ. 1,200 నుంచి రూ. 1,500 మధ్య వచ్చే మొబైల్ బిల్లు గడచిన ఆగస్టు నెలలో రూ. 2,49,112 వచ్చింది. దీంతో అవాక్కై లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ హైదరాబాద్ వాసి. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల నివాసి జయచంద్రరాజు ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ ఇచ్చిన రిలయన్స్ గ్రూప్ సిమ్ ను బ్లాక్ బెర్రీ ఫోన్లో వేసి వాడుకుంటున్నాడు. ఇదే సిమ్తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంటున్నాడు.
రెండు నెలలు క్రితం వరకూ బాగానే ఉంది. జులైలో రూ. 2.12 లక్షలు, ఆగస్టులో రూ. 2.49 లక్షలు బిల్లు వచ్చింది. దీంతో జయచంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు.
అయితే తొలుత హ్యాకింగ్ చేసి ఉండొచ్చన్న సమాధానం కూడా చెప్పారు రిలయన్స్ ప్రతినిధులు. అయితే కేసు విచారణలో భాగంగా కాల్ డేటా గణంకాలు తీసి చూడగా, మెయిల్స్ నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలు ఆటోమేటిక్ డౌన్ లోడ్లు, యాప్ అప్ డేట్స్ వంటి ఆప్షన్స్ ఆన్ లో ఉంచి పెట్టినందునే ఇంత ఎక్కువ బిల్లు వచ్చిందని తేల్చేశారు.
రిలయన్స్ సంస్ధ కంపెనీ మోసం చేయలేదని, తాము రిలయన్స్పై కేసు పెట్టలేమని, ఈ బిల్లు విషయమై సంస్థతో చర్చించి మాట్లాడుకోవాలని పోలీసులు సూచించారు.