ఇద్దరు భర్తలు.. 'సెక్స్' వీడియోలను షేర్ చేసుకున్నారు: భార్య కనిపెట్టేయడంతో వెలుగులోకి!
అతను కోరినట్లుగానే భార్యకు అనుమానం రాకుండా.. ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను, పడకగది దృశ్యాలను చైతన్య.. దీపక్ కు లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
హైదరాబాద్: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ వినియోగం పెరిగిపోయిన తర్వాత.. సొంతింట్లోనే మహిళలకు రక్షణ కరువైన పరిస్థితి ఏర్పడింది. నిఘా నేత్రంలా కెమెరా కన్ను ఎప్పుడూ వెంటాడుతుందో తెలియని పరిస్థితి. పడగ్గదిలోకి యథేచ్చగా దూరిపోతున్న కెమెరాలు.. ఏకాంత జీవితాన్ని సైతం ఇంటర్నెట్ లోకి ఎక్కించేస్తున్నాయి. ఇంట్లో వాళ్లే ఈ చర్యలకు పాల్పడుతుండటంతో బాధిత మహిళల ఆవేదన వర్ణనాతీతంగా మారుతోంది.
తాజాగా సైబరాబాద్ పరిధిలో ఇలాంటి నిర్వాకానికే పాల్పడ్డ ఓ భర్త గుట్టు రట్టయింది. విపరీత పోకడలున్న ఓ భర్త.. ఏకంగా భార్యతో గడిపిన ఏకాంత దృశ్యాలను స్కైప్ ద్వారా మరొకరితో షేర్ చేసుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య.. ఇటీవల అతని ల్యాప్ టాప్ పరిశీలించగా.. తన నగ్న దృశ్యాలు, పడక గదిలో గడిపిన దృశ్యాలు అందులో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక ఏమాత్రం సహించకుండా కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల కథనం మేరకు.. మేడ్చల్ జిల్లా శామీర్ పేటకు చెందిన ఆకుల కృష్ణ చైతన్య డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన యువతితో ఏడాది క్రితం ఇతనికి వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలలు బాగానే ఉన్న కృష్ణ చైతన్య.. ఆ తర్వాత భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. సూటి, పోటి మాటలతో నరకయాతన పెడుతున్నాడు.
కాగా, ఇటీవల చైతేన్య కృష్ణకు చెన్నైకి చెందిన శ్రీమాన్ దీపక్ అనే వ్యక్తితో ఆన్ లైన్ లో పరిచయడం ఏర్పడింది. ఓ వెబ్ సైట్ ద్వారా ఇద్దరూ నిత్యం చాటింగ్ చేసుకునేవారు. ఇదే క్రమంలో ఓరోజు స్కైప్ లోకి రావాలని దీపక్ చైతన్య కృష్ణను కోరాడు. తన భార్యతో గడిపిన పడక గది దృశ్యాలను చైతన్య కృష్ణకు లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఆపై 'నువ్వు కూడా నీ భార్యతో గడిపిన దృశ్యాలు పంపించు' అంటూ దీపక్ కోరాడు.
అతను కోరినట్లుగానే భార్యకు అనుమానం రాకుండా.. ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను, పడకగది దృశ్యాలను చైతన్య.. దీపక్ కు లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. నాలుగు రోజుల క్రితం చైతన్య కృష్ణ వైఖరి పట్ల భార్యకు తీవ్ర అనుమానం కలిగింది. అతను ఇంట్లో లేని సమయంలో ల్యాప్ టాప్ తెరిచి చూడగా.. అందులో తన నగ్న చిత్రాలు కనిపించి నివ్వెరపోయింది. దీంతో భర్త నిర్వాకాన్ని ఇక సహించకూడదని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ డీసీపీ జానకి షర్మిల నిందితుడు చైతన్య కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీమాన్ దీపక్ను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.