నెక్లెస్ రోడ్డులో ఇన్నోవా బీభత్సం, కారులో మద్యం: మరోచోట కారు దగ్ధం
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టిన రోజు సందర్భంగా పిల్లలతో కలిసి విందు చేసుకుని ఇంటికి కారులో వెళుతుండగా మద్యం మత్తులో నలుగురు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చి కారును ఢీకొట్టారు.
ఈ ఘటనలో మారుతీ కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. జేమ్స్ స్ట్రీట్కు చెందిన భానుకిరణ్- హిమబింధులు భార్యభర్తలు. హిమబిందు పుట్టిన రోజు కావడంతో పిల్లలతో కలిసి రాత్రి ఓ హోటల్లో భోజనం చేశారు.
అనంతరం ఐస్క్రీమ్ తినేందుకు నెక్లెస్ రోడ్కు వెళుతూ జలవిహార్ ముందు స్పీడ్ బ్రేకర్ ఉండటంతో కారు వేగం తగ్గించారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు ఏపీ 10ఏఆర్ 7101 నంబర్ గల ఇన్నోవా వాహనం వేగంగా నడుపుతూ వచ్చి ఢీకొన్నారు.
మంత్రి నారాయణ ఆ నిర్ణయం తీసుకుంటారా?
దీంతో కారు ఎడమ వైపు ట్రాఫిక్ గుర్తింపు రాడ్ను ఢీకొంది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది.
స్థానికులు పట్టుకొని అప్పగించారు
స్థానికులు ఇన్నోవాలో ఉన్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇన్నోవాలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రాంగోపాల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోచోట దగ్ధమైన కారు
మరోవైపు, హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పెద్ద అంబర్ పేట వెళ్తుండగా..
నగరంలోని బల్కంపేట్కు చెందిన శరత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి బొంగులూర్ నుంచి పెద్ద అంబర్పేట్ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి.
తప్పిన పెను ప్రమాదం
దీంతో అప్రమత్తమైన శరత్ కుమార్ వెంటనే కారు ఆపి తనతోపాటు ప్రయాణిస్తున్న నలుగురిని కారులోంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లో కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది.