మరికొంత కష్టం: వచ్చిన 500కోట్ల 500 నోట్లను వెనక్కి పంపారు
పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చిన రూ. 500 నోట్లను రిజర్వు బ్యాంకు అధికారులు వెనక్కి పంపించేశారు.
హైదరాబాద్: పెద్ద రద్దు నేపథ్యంలో నగరానికి వచ్చిన రూ. 500 నోట్లతో చిల్లర కష్టాలు తీరుతాయని భావించిన సామాన్యుడికి మరో షాక్ తగిలింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చిన రూ. 500 నోట్లను రిజర్వు బ్యాంకు అధికారులు వెనక్కి పంపించేశారు. దీంతో సామాన్యుడి కష్టాలు మరిన్ని రోజులకు పెరిగాయి.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రానికి రూ.500 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు ఇటీవలే వచ్చాయి. అయితే, వాటిలో పలు లోపాలున్నట్లు రిజర్వు బ్యాంకు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని బ్యాంకులకు పంపిణీ చేయకుండానే వెనక్కు పంపినట్లు తెలిసింది.
మళ్లీ కొత్త రూ. 500 నోట్ల రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చిల్లర కోసం అనేక కష్టాలు పడుతున్న సామాన్యుడు.. రూ. 500 నోట్ల కోసం మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఏటీఎంలలో కొత్త రూ. 2000ల నోట్లు వస్తున్న చిల్లర కోసం తిప్పలు తప్పడం లేదు.