షాక్: హైదరాబాదీ మహిళను రూ.3లక్షలకు అమ్మేశారు!
హైదరాబాద్ నగరంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఓ మహిళను రూ. 3లక్షలకు అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళను ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి..
హైదరాబాద్: నగరంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఓ మహిళను రూ. 3లక్షలకు అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళను ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. సౌదీకి పంపించిన కొందరు వ్యక్తులు ఆమెను అక్కడే ఓ వ్యక్తికి అమ్మేసినట్లు తెలిసింది.
హైదరాబాద్ నగరానికి చెందిన 39ఏళ్ల సల్మా బేగంను ఇద్దరు ఏజెంట్లు రూ. 3లక్షలకు సౌదీలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కాగా, ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి.. రోజూ ఆమెను శారీరకంగా, మానిసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.
బాబానగర్ సీ బ్లాక్కు నివాసం ఉండే ఆమెను పని పనిషిగా ఉండాలంటూ సౌదీ అరేబియాకు పంపించారు ఏజెంట్లు. అయితే, అసలు విషయమేమిటంటే ఆమెను ఇద్దరు ఏజెంట్లు అక్రమ్, షఫీలు.. రూ. 3లక్షలకు సౌదీ వ్యక్తికి అమ్మేశారు.
కాగా, తన తల్లిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని సల్మా కూతురు సమీరా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. తాను ఏజెంట్లను కలిసి వేడుకున్నా వారు పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించింది.
తన తల్లితిని సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తి కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన తల్లిని తిరిగి నగరానికి తీసుకురావాలని ఆమె వేడుకుంటోంది.