బాబు-లోకేష్ కోసం హైద్రాబాద్ టిడిపి: నన్ను వదిలేయమన్న చంద్రబాబు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే బాగుంటుందని నగర టిడిపి నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి వారు ఆదివారం నాడు తీసుకు వెళ్లారని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నేతృత్వంలో పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలనే అంశం చర్చకు వచ్చింది. మీరు ప్రచారం చేస్తేనే పార్టీకి బలం అని వారు చంద్రబాబుతో చెప్పారని తెలుస్తోంది.
1995-2004 వరకు చంద్రబాబు సమైక్య రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని, ఇది ప్రజలకు కూడా తెలుసునని, ఈ కారణంగా చంద్రబాబు ప్రచారం చేస్తే పార్టీకి లాభిస్తుందని వారు టిడిపి నేతలు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని వారు అధినేతతో చెప్పారని సమాచారం. తాను ప్రచారం కోసం సమయం చూసుకుంటానని చంద్రబాబు వారికి చెప్పారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు లేదా నారా లోకేష్ ప్రచారం చేయలేదు. అక్కడ బిజెపి అభ్యర్థి పోటీ చేశారు. కానీ గ్రేటర్ హైదరాబాదులోని 150 స్థానాల్లో టిడిపి - బిజెపి పంచుకొని పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం చేయాలని వారు భావిస్తున్ారు.
ప్రచారం కోసం సమయం చూసుకుంటానని చెప్పిన చంద్రబాబు... మరో విషయం కూడా వారికి చెప్పారని తెలుస్తోంది. తెలంగాణలో నన్ను వదిలేయాలని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఏపీకి నా అవసరం ఎంతో ఉందని, ఈ కారణనంగా తెలంగాణలో తనను పక్కన పెట్టి మీరే ఎదగాలని, తెలంగాణలో పార్టీ కార్యక్రమాలలో తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవాలని చెప్పారని తెలుస్తోంది.
తనను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయవద్దని చంద్రబాబు చెప్పినప్పటికీ... హైదరాబాదులో మీరు, లోకేష్ ప్రచారం చేస్తేనే మంచి ఫలితం ఉంటుందని వారు చెప్పారని తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అనంతరం తెలంగాణ సీఎం కెసిఆర్, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. ఆ తర్వాత వారిద్దరు కలిసిన విషయం తెలిసిందే.