మరదలుపై కన్నేయలేదు, భార్య బాత్రూం వద్ద కెమెరాపై టెక్కీ భర్త ఇలా..
హైదరాబాద్: బాత్రూం దగ్గర సహా ఇంట్లో మూడు చోట్ల కెమెరాలు పెట్టి, భార్య చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేసిన ఘటనలో సాఫ్టువేర్ ఇంజినీర్ శివశంకర్ స్పందించాడు. తన భార్య పూర్ణజ్యోతిని తాను హింసించలేదని, అలాగే తన భార్య చెల్లెలిని కోరుకోలేదని చెప్పారు.
ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. తాను ఇంట్లో భార్య సెక్యూరిటీ కోసమే సీసీ కెమెరాలు పెట్టానని చెప్పారు. అసలు తన మొబైల్లో తన భార్యకు చెందిన వీడియోలు లేవని చెప్పారు. అనవసరంగా నిన్ను ఇచ్చి పెళ్లి చేశామని, నీ బదులు నీ చెల్లి ఝాన్సీని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేదని నా భార్య తల్లే అనేవారన్నారు.
మరదలు కావాలంటున్నాడు: బాత్రూం వద్ద కెమెరాలు పెట్టి భార్యపై టెక్కీ నిఘాకాగా, మన పెళ్లిలో మీ చెల్లిని చూసినప్పటి నుంచి మనసైందని, ఎలాగైనా మీ తల్లిదండ్రులను ఒప్పించి దాన్ని తీసుకురావాలని, ఇద్దరినీ ఏలుకుంటానని భార్యను వేధిస్తున్నాడని బాధితురాలు పూర్ణజ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే.
సరదాకి అంటున్నాడని సరిపెట్టుకున్నా చాలా నెలల నుంచి రోజూ వేధించడం, ఇంట్లో ఎలాంటి పనులు చేస్తుందో తెలుసుకునేందుకు పడక గది, బాత్రూం లోపల, వెలుపల సీసీ కెమెరాలు అమర్చడంతో వాటిని భరించలేక పూర్ణజ్యోతి ఫిర్యాదు చేసింది.
పది నెలల నుంచి చిత్రహింసలు అనుభవిస్తున్నా కేవలం తల్లిదండ్రులు, కుటుంబ మర్యాద కోసం వాటన్నింటినీ ఓర్చుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసు అధికారులను వేడుకుంది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గంగాధర రావు రెండు దశాబ్దాల క్రితమే ఉద్యోగరీత్యా భార్య రమాదేవి, ఇద్దరు ఆడ పిల్లలతో పుణెలో స్థిరపడ్డారు. ఎంఏ సైకాలజీ చదువుకున్న పూర్ణజ్యోతికి పెళ్లి చేద్దామంటూ గత ఏడాది జనవరి నుంచి ఇంటర్నెట్, పత్రికల్లోని వివాహ వేదికల ద్వారా ప్రయత్నించారు.
హైదరాబాద్లోని గోషా మహల్ నివాసి దుర్గం జయపాల్, విజయలక్ష్మిల కుమారుడు, ఓ వెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజినీరైన శివశంకర్ నచ్చడంతో గత ఏడాది నవంబరులో పెళ్లి చేశారు. పూర్ణజ్యోతి మెట్టినింటికి రాగానే ఆమె అత్త విజయలక్ష్మి.. నీవంటే ఇష్టం లేదని, మీరిద్దరు వేరుగా ఉండాలని చెప్పారు.
దీంతో శివశంకర్, పూర్ణజ్యోతి వేరుగా ఉన్నారు. అనంతరం హిమాయత్ నగర్లో అయిదు నెలలపాటు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే శివశంకర్ రెండో కోణం పూర్ణజ్యోతికి తెలిసింది. హాల్లో సీసీ కెమెరాలు అమర్చాడు. రాత్రి వేళల్లో ఆమెను ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రెండు, మూడు రోజుల తర్వాత వచ్చేవాడు.
అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న శివశంకర్ను పూర్ణజ్యోతి నిలదీయగా అప్పుడు అతడి పైశాచికాన్ని చూపించాడని వార్తలు వచ్చాయి. అందంగా లేకపోయినా పెళ్లి చేసుకున్నానని, నీతో కలిసి ఉండాలంటే మీ చెల్లిని తీసుకురావాలన్నాడు. ముగ్గురం కలిసి కాపురం చేద్దామని చెప్పేవాడని అంటున్నారు.
భార్యభర్తలు మరో ఇంటికి మారారు. ఏసీ గార్డ్స్లోని పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయం సమీపంలో ఓ ఫ్లాట్కు వెళ్లారు. అక్కడ రెండో రోజే శివశంకర్ పడక గది, హాల్, బాత్రూం, వెలుపల సీసీ కెమెరాలను అమర్చాడు. ఆ దృశ్యాలను నిరంతం చూసేందుకు వీలుగా తన సెల్ఫోన్ అనుసంధానం చేసుకున్నాడు.
అనంతరం తాను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నానని ఖర్చులకు రూ.500లు ఇచ్చాడు. సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేశావని అడిగితే.. నీవు ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ తన మీదకు కేసు వస్తుందని, అందుకే ఈ ఏర్పాటు అన్నాడని చెబుతున్నారు.
ఇప్పటికైనా చెల్లిని తీసుకు వస్తే సంసారం సాఫీగా సాగుతుందని చెప్పాడని అంటున్నారు. పూర్ణజ్యోతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పుణె నుంచి వచ్చి ఫ్లాట్ను ఖాళీ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసు పోలీస్ స్టేషన్లో శివశంకర్పై కేసు నమోదు చేశారు.