మర్మాంగాలు కోసిన లలిత్ హత్య కేసు: ముగ్గురి అరెస్ట్, పరారీలో ఒకరు
హైదరాబాద్: ఇంజినీర్ లలిత్ ఆదిత్య (26) హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఇంజినీరును తీవ్రంగా గాయపరిచి హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఈ పరువు హత్య కేసులో పోలీసులు శుక్రవారం నాడు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హత్య విషయమై వారిని విచారించనున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నది.. భార్య, ఆమె తల్లిదండ్రులుగా తెలుస్తోంది.
లలిత్ ఆదిత్య మృతి చెందిన విషయం తెలియడంతో కొంపల్లిలో ఉంటున్న తల్లి శైలజ సంఘటన స్థలానికి చేరుకుంది. తన కొడుకు మంచివాడని, బుధవారం మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ప్రేమ వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తాడనుకుంటే ఊహించని విధంగా జరిగిందని కంటతడి పెట్టారు.
సచివాలయ నగర్లో ఉంటున్న లలిత్ ఆదిత్య ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి వనస్థలిపురంలోని సుష్మితా రెడ్డితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా 2015లో వివాహం చేసుకున్నారు.
అనంతరం లలిత్ ఉద్యోగ విధుల నిమిత్తం భార్యతో గుజరాత్ వెళ్లాడు. లలిత్కు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో అక్కడి నుంచి ఆరు నెలల క్రితం వారు నగరానికి వచ్చి మీర్పేటలో ఉంటున్నారు.
రెండు నెలల క్రితం తిరిగి మద్యం తాగి వచ్చి లలిత్ భార్యతో గొడవ పడటంతో ఆమె రాగన్నగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. భార్యను తీసుకు రావడానికి ఆగస్టు 9వ తేదీన లలిత్ రాగన్నగూడకు వెళ్లాడు. అక్కడ అతను అత్తవారి ఇంటిలో ఉన్న సామగ్రిని పగులగొట్టి తమను దూషించాడని అతని మామ వెంకటరెడ్డి ఆదిభట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో లలిత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రాజీ కుదిరింది. ఆ తర్వాత తన భార్యను తీసుకుని వచ్చి వనస్థలిపురం సచివాలయనగర్లో ఉంటున్నారు.
ఆ తర్వాత మళ్లీ గొడవ జరిగింది. దీంతో సుష్మిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. లలిత్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అతనికి పరిచయస్తుడైన రాహుల్ బుధవారం అర్ధరాత్రి వచ్చి అతనితో పాటు అక్కడే పడుకున్నాడు. తెల్లవారు జామున 3.30 సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు పెంట్హౌస్లో నివాసముంటున్న లలిత్ ఇంటి తలుపు తట్టారు.
తలుపు తెరవగానే.. అక్కడే ఉన్న రాహుల్ను బయటకు వస్తే చంపేస్తామని బెదిరించి తలుపులు పెట్టారు. లలిత్ను పెంట్హౌస్ నుంచి మెట్ల పైకి లాక్కొచ్చి కత్తితో కళ్లు, తలపై పొడిచారు. పూల కుండీలతో తలపై కొట్టారు. అతను రక్తపు మడుగులో కొనప్రాణాలతో ఉండగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అంతస్థులో ఉంటున్న ట్రాఫిక్ ఏఎస్ఐ ఆ దాడిని నిలువరించడానికి ప్రయత్నించినా అతనినీ నెట్టివేశారు.