'మా అమ్మను అమ్మేశారు...కాపాడండి' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
జీవనోపాధి కోసం ఉద్యోగం చూడమని చెబితే, అదే అదనుగా భావించిన ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు ఓ మహిళకు ఉద్యోగం అని చెప్పి ఏకంగా రూ.3 లక్షలకు ఆమెను సౌదీ అరేబియాలోని మరో దళారికి అమ్మేసిన ఉదంతమిది.
చార్మినార్: ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే కంటే ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవచ్చని భావించి సౌదీ వెళ్లిన ఓ మహిళ అక్కడ నరకం చూస్తున్న ఉదంతమిది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని చంపాపేట్ పరిధిలోని హఫీజ్ బాబానగర్ కు చెందిన సల్మా బేగం (39) తన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని భావించి, సౌదీలో నర్సుగా పని ఉంటే చూడాలని బండ్లగూడకు చెందిన గల్ఫ్ దళారులు అక్రమ్, షఫీలను ఆశ్రయించింది.
ఆ దుర్మార్గులిద్దరూ సౌదీ అరేబియాలోని ఓ మధ్యవర్తితో మాట్లాడి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుని ఉద్యోగానికంటూ ఆమెను సౌదీ అరేబియా పంపారు. తీరా అక్కడకి వెళ్లిన సల్మా బేగంకు చేదు అనుభవం ఎదురైంది. తనను వివాహం చేసుకోవాలంటూ ఆమెను అక్కడికి పిలిపించుకున్న యజమాని వేధింపులకు గురి చేశాడు.
సల్మా బేగం ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన యజమాని ఆమెను పనిమనిషిగా మార్చేశాడు. ఆమెను తాను కొనుగోలు చేశానన్న విషయం చెబుతూ, విరామం ఇవ్వకుండా పని చేయించుకుంటూ శారీరక, మానసిక వేదనకు గురి చేశాడు.
దీంతో సల్మా బేగం అనారోగ్యం బారిన పడింది. ఆ నరకాన్ని భరించలేక... అదను చూసుకుని హైదరాబాదులో ఉన్న తన కుమార్తె సమీనాకు ఆడియో మెసేజ్ పంపింది. ఉద్యోగం పేరు చెప్పి ఏకంగా తన తల్లిని అమ్మేశారని తెలుసుకున్న ఆమె అవాక్కయింది.
వెంటనే తన తల్లిని సౌదీ అరేబియాకు పంపించిన దళారులు అక్రమ్, షఫీల వద్దకు వెళ్లి వారిని నిలదీసింది. దీంతో వారు తమకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వమని, ఎలాగైనా సల్మాబేగంను తిరిగి రప్పిస్తామని నమ్మబలికారు.
వారు చెప్పిన గడువుదాటిపోయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, తన తల్లి తిరిగి రాకపోవడంతో సమీనా నేరుగా కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.