కేసీఆర్! సంపద ఇచ్చా, కాపాడుకో: బాబు, పిట్టకథ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి నేను సంపదను సృష్టించి ఇచ్చానని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైననే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు చెప్పిన పొట్టేలు కథ
నా పాదయాత్ర సమయంలో ఓ మహిళ నన్ను కలిసింది. ఆమె వెనుకే ఓ పొట్టేలు కూడా ఉంది. అమ్మా.. అది ఎప్పుడు నీ వెనకాలే ఉంటుంది, ఏం పెడతావు అని అడిగాను. తాను గడ్డి మాత్రమే పెడతానని ఆమె సమాధానమిచ్చింది.
ఒకసారి నేను గడ్డిపెడతా నా వద్దకు వస్తుందా అని ప్రశ్నించాను. దానికి ఆమె ప్రయత్నించి చూడమని చెప్పింది. నేను ఆ పొట్టేలుకు గడ్డి పెట్టాను. కానీ అది తినలేదు. ఆమె పెడితే మాత్రం తింది. అది విశ్వాసం అంటే. నేను ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యేలను చేస్తే వారు విశ్వాసం లేకుండా పోతున్నారు.
చంద్రబాబు ఈ పొట్టేలు కథను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలంగాణ టీడీపీ నేతలను ఉద్దేశించి చెప్పారు.
ఓయూ భూములు విద్యార్థులకే చెందాలని, వాటిపై హక్కు వారిదేనని, ఆ భూములను పరాధీనం చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని సీఎం చంద్రబాబు గురువారం స్పష్టం చేశారు. గండిపేట తెలుగువిజయంలో జరుగుతున్న మహానాడులో గురువారం తెలంగాణలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర రావు చర్చను ప్రారంభించారు. ఓయూ భూములను పక్కా ఇళ్ల నిర్మాణ అవసరాలకు వినియోగించాలన్న ప్రభుత్వ యోచనను తప్పుబట్టారు.
దీనిపై చంద్రబాబు స్పందించారు. గతంలో ఉస్మానియా భూములను కబ్జా చేయాలని చూసారని, దాన్ని అడ్డుకున్నామని, గతంలో ఓ సీఎం వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇవ్వాలని చూశారని, వ్యతిరేకత రావడంతో ఆగిపోయారన్నారు.
హైదరాబాద్లో భూములను రక్షించిన చరిత్ర టీడీపీదేనని, ఉస్మానియా విద్యార్థులు చాలా త్యాగాలు చేశారని, ఓయూ భూములు విద్యార్థులకే చెందాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు, షెడ్యూలు కులాలకు స్థానం కల్పించే వరకు తమ పార్టీ ఆ వర్గాల తరఫున పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కరెంట్ విషయంలోనే కాదు, అన్నీ విషయాల్లో సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని, రెండు ప్రభుత్వాలు సహకరించుకుని తద్వారా ముందుకు పోవాలన్నారు. ఈ రోజున ఏపీలో మిగులు విద్యుత్ ఉందని, తెలంగాణకు కరెంటు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామన్నారు.