ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు, నా పేరెలా వచ్చిందో, కెరీర్ ను దెబ్బతీసేందుకే: నటుడు నందు
జీవితంలో తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని.. కావాలంటే తనను పరీక్షించుకోవచ్చని సినీనటుడు నందు సవాల్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడంతో షాక్కు గురైనట్లు చెప్పారు.
హైదరాబాద్: జీవితంలో తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని.. కావాలంటే తనను పరీక్షించుకోవచ్చని సినీనటుడు నందు సవాల్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడంతో షాక్కు గురైనట్లు చెప్పారు.
డ్రగ్స్ వ్యవహారంలో కొంతమంది సినీ ప్రముఖులను ఈ నెల 19 నుంచి 25 వరకు హైదరాబాద్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.
ఎక్సైజ్ కార్యాలయానికి స్వయంగా...
డ్రగ్స్ వాడకం కేసులో సిట్.. సినీనటుడు నందుకి కూడా నోటీసులు పంపించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, శుక్రవారం సాయంత్రం నందు స్వయంగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఆ కార్యాలయంలో అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు.
నాకసలు నోటీసే రాలేదు, నా పేరెలా...?
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... తనకు అసలు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదని అన్నాడు. తన పేరు ఎందుకిలా బయటకు వచ్చిందో తెలుసుకుందామని అక్కడకు వచ్చానని తెలిపాడు.
గతంలోనూ ఇలాగే... కెరీర్ ను దెబ్బతీయాలనే...
గతంలోనూ తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని.. అప్పుడు కూడా తాను బయటపడ్డానని నటుడు నందు చెప్పారు. సంబంధంలేని వ్యవహారంలో ఇరికించి తన కెరీర్ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కెల్విన్ పేరు ఇప్పుడే వింటున్నా...
లిస్ట్లో లేని వారి పేర్లు ప్రచారమవుతుండటంపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని నందు వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్తో తనకు ఎలాంటి పరిచయం లేదని.. అతడి పేరు తొలిసారి వింటున్నానన్నారు.
కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి...
మీడియాలో ఓ వర్గం కావాలని తనపై దుష్ప్రచారం చేస్తోందని.. తన రక్తాన్ని లైవ్లో పరీక్షించుకోవచ్చని సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో మీడియా కాస్త సంయమనంతో వ్యవహరిస్తే బాగుంటుందని నందు అభిప్రాయపడ్డారు.