రోహిత్ సూసైడ్ లేఖ సహా అన్ని రికార్డులివ్వండి: హైకోర్టు, మోడీపై తల్లి రాధిక
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ రాసిన లేఖతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించిన మొత్తం రికార్డులను తమ ముందుంచాలని గురువారం పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
రోహిత్ ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రశాంత్ అనే విద్యార్థి దాఖలు చేసిన ఫిర్యాదులో తనను నిందితునిగా చేర్చారని, తనపై కేసు కొట్టివేయాలంటూ విశ్వవిద్యాలయం వీసీ పొదిలి అప్పారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారణ చేపట్టారు.
ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్పై దాడి జరిగేనాటికి వీసీగా తాను బాధ్యతలు నిర్వహించడంలేదని ఆయన తరఫు లాయర్ ఎన్వి సుమంత్ కోర్టుకు వెల్లడించారు. అప్పటికి ప్రొఫెసర్గానే కొనసాగుతున్నట్లు చెప్పారు. సుశీల్ కుమార్పై దాడికి సంబంధించి ప్రాక్టోరియల్ బోర్డు విచారణ చేపట్టి నివేదిక ఇస్తూ సస్పెన్షన్కు సిఫార్సు చేయగా విశ్వవిద్యాలయం పాలక మండలి కూడా ఆమోదించిందన్నారు.
వీసీగా బాధ్యతలు స్వీకరించక ముందే సుశీల్ కుమార్పై దాడి సంఘటన, ప్రాక్టోరియల్ బోర్డు విచారణ జరిగాయన్నారు. 2015 సెప్టెంబరు 23న వీసీగా బాధ్యతలు స్వీకరించాక ప్రాక్టోరియల్ బోర్డు, పాలకమండలి సిఫారసులు అప్పారావు ముందుకు వచ్చాయన్నారు.
విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేయకుండా వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేవలం వసతి గృహాల్లో ప్రవేశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
అనంతరం నెల రోజులకు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, రోహిత్ సూసైడ్ నోట్లో వీసీ పేరు లేదన్నారు. వాదనలను విన్న జడ్జి సూసైడ్ నోట్తోపాటు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమ ముందుంచాలంటూ గచ్చిబౌలి పోలీసులను ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.
హెచ్సియు విద్యార్థుల బస్సుయాత్ర ప్రారంభం
రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వర్సిటీ విద్యార్థులు 23రోజులుగా చేస్తున్న పోరాటంలో భాగంగా గురువారం బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణలో వివిధజిల్లాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు రోహిత్కు జరిగిన అన్యాయం వివరించనున్నారు.
కాగా, రోహిత్కు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ విద్యార్థి తల్లి రాధిక స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రెండుసార్లు హైదరాబాద్కు వచ్చి తమను ఓదార్చినా, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మాత్రం అలాంటి స్పందన రాలేదన్నారు.
ఢిల్లీ జెఎన్యు ఘటనపై దేశద్రోహం కేసు
పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జెఎన్యు)లో కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.
బిజెపి ఎంపీ మహేష్ గిరి, ఏబీవీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి రంజన్ భగత్ గురువారం తెలిపారు. తదుపరి చర్యల కోసం కార్యక్రమ వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అఫ్జల్ గురును ఉరితీసిన రోజు సందర్భంగా మంగళవారం కొందరు విద్యార్థులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతి వ్యతిరేకమైన ఈ కార్యక్రమానికి అనుమతించవద్దని ఏబీవీపీ సభ్యులు ముందే కోరడంతో అనుమతి రాలేదు. అయినప్పటికీ కార్యక్రమం చేపట్టారు.