చార్మినార్నైనా కూల్చ్లాల్సిందే: అలీ సంచలన వ్యాఖ్య, ఆపై వివరణ
వరంగల్: శిథిలావస్థకు చేరితే భాగ్యనగరంలో చార్మినార్ను అయినా కూల్చాల్సి ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పురాతన భవనాల పైన ఆయన వరంగల్ జిల్లాలో పైవిధంగా స్పందించారు.
ఉస్మానియా ఆసుపత్రి మార్పు పైన ఆయన స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రి పేరు మార్చకుండా బహుళ అంతస్తుల నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు.
అయినా ప్రజలకు మ్యూజియంలు ముఖ్యమా? లేక ఆసుపత్రులు ముఖ్యమా? అనేది ఇతర పార్టీల నేతలే చెప్పాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయకుండా అక్కడి ఖాళీ ప్రదేశంలో బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలని మజ్లిస్ సూచించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు వందల సంవత్సరాల తర్వాత చారిత్రక కట్టడమైన చార్మినార్ శిథిలావస్థకు చేరితే దానిని కూల్చకుండా ఉంటామా అని చేసిన వ్యాఖ్యల పైన విమర్శలు వచ్చాయి.
దీంతో, ఆయన తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకున్నారు. చార్మినార్ను తొలగించాలని తాను ఎలా చెబుతానని, అది తెలంగాణకు సింబల్ అన్నారు. అయితే, చార్మినార్ ప్రస్తుతం బాగానే ఉందని చెప్పారు. తాను చెప్పింది మరికొన్నేళ్ల తర్వాత విషయం గురించి అన్నారు.