వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే నేనే సిఎం
కడెం : వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి తాను ముఖ్యమంత్రిని అవుతానని మాజీ మంత్రి, సిఎల్ పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
శుక్రవారం రాత్రి ఆయన కడెం కు వచ్చారు. హరితా రిసార్ట్స్ లో ఆయన బస చేశారు. శనివారం ఉదయం కడెం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద ఆయన మార్నింగ్ వాక్ చేశారు. వరద గేట్ల నుంచి లీకేజీలు, నీటిమట్టం గది, గేట్లు ఎత్తే గదులను చూసి, వాటిని మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు.కడెం ప్రాజెక్టు వద్ద లీకేజీలను కోమటిరెడ్డి మంత్రి హారీష్ రావు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే మరమత్తులు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రిని అవుతాను
2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి తాను ముఖ్యమంత్రిని అవుతానని కోమటిరెడ్డి చెప్పారు.వచ్చే ఎన్నికల కోసం కోమటిరెడ్డి సోదరులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లోనే వీరు తెలంగాణలో తమకు అనుకకూలంగా ఉన్న అభ్యర్థుల విజయం కోసం కృషిచేశారు. అయితే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారు. పార్టీ బాధ్యతలను అప్గగిస్తే తమ పనితనం ఏమిటో చూపిస్తామని వారు చెబుతున్నారు. కొంతకాలం క్రితం పార్టీ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరికో ఒకరికి అప్పగిస్తారనే ప్రచారం కూడ సాగింది. కడెం లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విబేధాలు వీడి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని ఆయన కార్యకర్తలను కోరారు.
సిఎల్ పి ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. పార్టీలో సీనియర్లు ఉన్నారు. అయితే ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర ఏళ్ళ సమయం ఉంది. ఇంత సమయం ఉన్నా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది. మరో వైపు గత ఎన్నికల్లోనే చాలా మంది సీనియర్లు సిఎం పదవి రేసులో ఉన్నారు. అయినా పార్టీ విజయం సాధించలేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.