మహిళ హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం
మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని పుట్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్ళిన వివాహిత బాణావత్ లక్ష్మీ (35) గ్రామం ప్రక్కనే ఉన్న మిర్చి పొలంలో శవమై తేలింది. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
బాణావత్ లక్ష్మీ, ఆమె కుమారుడు శ్రీకాంత తల్లి ఈశ్వరమ్మతో కలిసి పుట్లగూడెంలో నివాసం ఉంటున్నారు. బాణావత్ పాత్చ్యా, ఈశ్వరమ్మ సహజీవనం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురం తండాకు చెందిన ఈశ్వరమ్మ భర్త చనిపోవటంతో పాత్చ్యాతో కలిసి జీవిస్తూ 10 సంవత్సరాల క్రితం మిర్చికోతలకు కుమార్తె లక్ష్మీతో కలిసి పుట్లగూడెం వచ్చింది.
పుట్లగూడెంలోని చిట్టెంశెట్టి చిన్న వీరయ్య (బుల్లెబ్బాయ్)తో లక్ష్మీకి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయమై వీరయ్య కుటుంబ సభ్యులు తరచూ గొడవలు పడుతుండేవారు. సోమవారం రాత్రి బాణావత్ లక్ష్మీకి రెండుసార్లు ఫోన్ కాల్స్ రావటంతో బహిర్భూమికని తల్లి ఈశ్వరమ్మతో చెప్పి వెళ్ళింది. ఎంతసేపటికి రాకపోవటంతో కుటుంబసభ్యులతో కలిసి చుట్టుపక్కలా గాలించారు.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మిర్చి పొలంలో మహిళ మృతదేహం ఉందన్న సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు వెతకగా లక్ష్మీ మృతదేహం వెలుగుచూసింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని మిర్చిపొలం నుంచి బయటకు తీశారు.
తలపై ఎడమ చెవిప్రక్క బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. క్లూస్టీం సభ్యులు పలు ఆధారాలు సేకరించారు. డాగ్స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి చిట్టెంశెట్టి చిన్న వీరయ్య ఇంటివద్ద ఆగింది. సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ జి రాజేశ్వరరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది.