హైదరాబాద్లో వాన బీభత్సం: ఇళ్ల నుంచే టెక్కీల పని, ఆప్షన్స్ కోసం....
హైదరాబాద్: వర్షాలు ఆగకపోవడంతో హైదరాబాద్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. దీంతో హైదరాబాదులోని టెక్కీలు ఇళ్ల నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. శుక్రవారంనాడు దాదాపు 60.70 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇళ్లలో ఉండే పనిచేశారు.
దాంతో ఐటి కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. కొద్ది మంది మాత్రం హైదరాబాదు రోడ్లను దాటి, వర్షాలకు ఎదురీది కార్యాలయాలకు వస్తున్నప్పటికీ పరిస్థితి దిగదుడుపుగానే ఉన్నాయి. హైదరాబాదు రోడ్లపై చాలా వరకు ఇంకా నీరు చేరి ఉంది. ఎక్కడ ఏ మ్యాన్హోల్ మింగేస్తుందో చెప్పలేని పరిస్థితి.
ట్రాఫిక్ జామ్లు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. కార్లు సగం లోతు వరకు నీళ్లలో మునిగిపోతున్నాయి. ద్విచక్రవాహనదారుల పరిస్థితి చెప్పనలివి కాకుండా ఉంది. దాంతో టెక్కీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఐటి కంపెనీలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి బిజినెస్ కంటిన్యూయిటీ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలు ఎలా ఉంటాయనే ఆలోచన చేస్తున్నాయి.
ఇప్పటి వరకు హైదరాబాదు ప్రత్యామ్నాయంగా ఉంటూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థఇతి తారుమారైంది. టెక్కీలు ఇళ్ల నుంచి పనిచేస్తుండడంతో అపార్టుమెంట్లు గజిబిజిగా తయారయ్యాయి. మరిన్ని రోజులు హైదరాబాదులో వానలు పడవచ్చునని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు.