హైదరాబాదీలతో టచ్: ప్రత్యేక యాప్లతో ఐఎస్ చీఫ్ ఉగ్ర వల
హైదరాబాద్: నగరంలోని ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను రహస్యంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు సిరియా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ షఫీ ఆర్మర్ పది పేర్లను, మూడు యాప్లను వినియోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది.
సిరియా నుంచి వివిధ పేర్లతో భారత్లోని యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రత్యేకించి హైదరాబాద్ యువతను ఆకర్షించేందుకు మూడు యాప్లను వినియోగించే వాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
'ఐఎస్ చీఫ్ ఆర్మర్ తనకు తానుగా కొత్త పేర్లతో యువతకు యాప్ ద్వారా పరిచయమయ్యేవాడు. చోటాముల్లా, అహ్మద్ అలీ, అంజన్ భాయ్, నౌక్వా, యూసుఫ్ ఆల్ హింది, గుమ్నామ్, షఫీ వంటి మారు పేర్లతో యువతను రిక్రూట్ చేసుకునేవాడు' అని ఇటీవల అరెస్టయిన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అర్షద్, ఖాదిర్లను విచారించగా వెల్లడైనట్టు ఎన్ఐఏ పేర్కొంది.
హైదరాబాదీలతో టచ్లో ఉంటూ వాట్సాప్లను వినియోగించకుండా ట్రిలియాన్, సుర్స్పాట్, నింబస్ అనే యాప్లను షఫీ ఆర్మర్ వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది.
సైబర్ సెక్యూరిటీ విభాగం ఈ మూడు యాప్లపై దర్యాప్తు కొనసాగిస్తోందని, ఈ యాప్లలో అర్షద్కు సన్నిహితుడైన పశ్చిమబెంగాల్ నివాసి ఆశిక్ అహ్మద్ అలియాస్ రాజుతో చర్చలు జరిపేవాడని, యాప్స్ హ్యాకింగ్కు పాల్పడే వారని తెలంగాణ పోలీసులు గుర్తించినట్లు, ఇది ఎన్ఐఏ దర్యాప్తులో కూడా వెల్లడైనట్లు తెలిసింది.
కాగా, గత కొద్ది నెలల క్రితం ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ నగరంలో పలువురు ఐఎస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరంలో మరికొంత మంది సానుభూతిపరులు తిష్టవేసుకున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎస్ కీలక నేతలు హైదరాబాద్ యువతపై కన్నేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తు తేల్చింది.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్లో సానుభూతిపరులైన యువతను ఐఎస్ ఉగ్రవాదులుగా తయారు చేసేందుకు కొన్ని విద్యా సంస్థలు పని చేస్తున్నాయంటూ ప్రవీణ్ కుమార్ అనే లెక్చరర్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొంత సమయానికే రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎన్ఐఏ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.