దిమ్మతిరిగే నిజాలు: జిహాదీగా మారుతానని.. అలా సుబ్రహ్మణ్యం నుంచి ఒమర్
మత మార్పిడి చేసుకొని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఇస్లామిక్ స్టేట్స్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.
హైదరాబాద్: మత మార్పిడి చేసుకొని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఇస్లామిక్ స్టేట్స్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.
ఒమర్ అలియాస్ సుబ్రహ్మణ్యం: ఫేస్ బుక్ లో పరిచయం.. ఐసిస్ వైపు పయనం
పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్లోని ఉగ్రవాద నాయకులను కలిసేందుకు మధ్యవర్తులు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు, పెట్రోలు బాంబులు, పేలుడు పదార్థాల తయారీ, మత విద్వేషాలను ఎలా సృష్టించాలనే అంశాలపై సోషల్ మీడియా ద్వారా శిక్షణ పొందినట్టు తెలిపాడు. జీహాదీగా మారేందుకు సిద్ధమయ్యానని అంగీకరించాడు.
అతడిని హైదరాబాద్ సిట్ పోలీసులు జూన్ 23న అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో ఏడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. పలు విషయాలు వెల్లడించాడు.
అలా సుబ్రహ్మణ్యం నుంచి ఒమర్గా మారాడు
ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కోత మాజేర్లో పుట్టిన సుబ్రహ్మణ్యం మచిలీపట్నంలో ఇంటర్ చదివేటప్పుడు క్లాస్మెట్స్ అబ్బాస్, మస్తాన్ ప్రోత్సాహంతో మత మార్పిడి చేసుకొని ఒమర్గా మారాడు. తర్వాత గుజరాత్లోని ఓ మదర్సాలో తొమ్మిది నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ హైదరాబాద్ కిషన్బాగ్కు చెందిన మహ్మద్ షఫీ పరిచయం కావడంతో నగరానికి వచ్చాడు. రెండు వారాలపాటు ఇక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బహుదూర్పురాకు చెందిన డాక్టర్ వాసిమ్ పరిచయమయ్యాడు. అతడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండే వైద్యుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ వద్ద కొన్నాళ్ల పాటు ఆశ్రయం కల్పించాడు.
పట్టు సాధించాడు
ఆ తర్వాత అబిడ్స్లో నివాసముండే విజయవాడకు చెందిన వాసిత్తో, మిశ్రిగంజ్కు చెందిన అబ్దుల్ ఖదీర్తో పరిచయమైంది. 2016 ఆగస్ట్లో సుబ్రహ్మణ్యం, అబ్దుల్ ఖదీర్ కలిసి కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఉర్సు ఉత్సవాలకు వెళ్లగా అక్కడ జమ్ము కాశ్మీర్కు చెందిన గ్లోబల్ స్కూల్ నిర్వాహకుడు మహ్మద్ అమీర్ పరిచయమయ్యాడు. సుబ్రహ్మణ్యంను శ్రీనగర్కు తీసుకెళ్లి స్కూల్లో అకౌంటెంట్గా ఉద్యోగమిచ్చాడు. 2016 నవంబర్లో సుబ్రహ్మణ్యం తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. తర్వాత ముంబైకి చెందిన అబు క్వాహాఫా ఆల్-హిందీ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. అతడి సూచన ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని జీహాదీ, ఐఎస్కు సంబంధించిన అంశాలపై ఎక్కువగా చూసేవాడు. అనంతరం ముంబై వెళ్లి పేలుడు పదార్థాల తయారీ, మత ఘర్షణలు ఎలా రెచ్చగొట్టాలి తదితర అంశాలపై పట్టు సాధించాడు. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి హైదరాబాద్ వచ్చాడు.
వారికి ఆశ్రయం కల్పించాడు
మహ్మద్ అమీర్, మహ్మద్ హయత్, ముజాహిద్, ఉమేర్, మహ్మద్ అయాజ్ చందాలు వసూలు చేయడానికి హైదరాబాద్ వస్తున్నారని, వారికి ఆశ్రయం కల్పించాలని శ్రీనగర్లోని గ్లోబల్ స్కూల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అతడితోపాటు వైద్యులైన వాసిమ్, జిలానీ, టోలిచౌక్లోని అమృద్దీన్ కలిసి శ్రీనగర్ నుంచి వచ్చిన ఐదుగురికి టోలిచౌక్లో నాలుగు రోజుల పాటు సుబ్రహ్మణ్యం ఆశ్రయం కల్పించారు. వారు బంజారాహిల్స్, మెహిదీపట్నం, దారుసలాంకు వెళ్లి చందాలు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత జకీర్ నాయక్ తదితరుల గురించి యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నాడు.
జిహాదీగా మారుతానని..
పాకిస్థాన్ ఉగ్రవాదులతో చాటింగ్ అనంతరం సుబ్రహ్మణ్యం ముంబై, గోవా, మధురై, సౌదీ అరేబియా, నైజీరియా, జొహన్నెస్బర్గ్కు చెందిన పలువురితో ఉగ్రవాద కార్యకలాపాలపై చాటింగ్ చేశాడు. తాను జీహాదీగా మారుతానని, పాక్కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్లో చేరుతానని, పాకిస్థాన్కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్ను, ఒసామా బిన్ లాడెన్ అనుచరులను కలువాలని ఉందని చెప్పాడు. జీహాదీగా మారాలంటే ముందు సొంతగా బాంబులు తయారుచేసే విధానం నేర్చుకోవాలంటూ ముంబైకి చెందిన క్వాహాఫా పేర్కొన్నాడు. సుబ్రహ్మణ్యం చెప్పిన వివరాల మేరకు టెలిగ్రామ్, వాట్సప్, ఫేస్బుక్లలో చాటింగ్ చేసిన అంశాలను సిట్ వెలికి తీసింది. క్వాహాఫా ఆదేశాలు, ప్రేరణతో కుట్రకు సిద్ధమయ్యారని తన వాంగ్మూలంలో సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ వివరించాడు.