హమ్మయ్య: ఐసిస్ చెర నుంచి తెలుగువారికి విముక్తి, రెండు రోజుల్లో ఇంటికి
హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారికి విముక్తి లభించింది. తెలుగువారిద్దరూ క్షేమంగానే ఉన్నట్లు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో వారిని భారత్కు తీసుకొస్తామని చెప్పారు.
ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువారిని విడిచిపెట్టినట్లు లిబియాలో ఉన్న భారత విదేశాంగ శాక అధికారులు నుంచి సమాచారం అందినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తెలుగువారైన బలరాం, గోపీకృష్ణలను లిబియాలోని భారత దౌత్యకార్యాలయానికి తరలించారు.
దౌత్యకార్యాలయంలో వీరిద్దరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజూ కూడా లిబియాలోని విదేశాంగ అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చూపిన చొరవ ఎనలేదని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని సూచించారు. లిబియాలోని విదేశాంగ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిని కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో గోపికృష్ణ, బలరాంలను భారత్కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. బలరాం, గోపీకృష్ణ విడుదలకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే.
గోపీకృష్ణ, బలరాం విడుదలయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తన భర్త విడుదల కావడం సంతోషమని బలరాం సతీమణి శ్రీలత చెప్పారు. తన భర్త విడుదలకు సహకరించిన కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లిబియాలోని సిర్టే వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు భారతీయులను ఆరు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కారులో వస్తుండగా సిర్టే పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్పోస్ట్ వద్ద వీరిని ఉగ్రవాదులు అపహరించారు. ఆ తర్వాత రెండు రోజులకు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్కుమార్లను విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఐఎస్ చెర నుంచి బయటపడిన వారు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం చేరుకుని అనంతరం కర్ణాటకకు వెళ్లారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ ఓయూలో పీహెచ్డీ చేసి ఏడేళ్ల క్రితం లిబియాకు వెళ్లి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గోపీకృష్ణ భార్య కళ్యాణి, కుమారుడు కృష్ణసాయి ఈశ్వర్(4), కుమార్తె జాహ్నవి(10)లతో కలిసి నాచారంలోని వీరారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.
కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన సి.హెచ్.బలరాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్డీ చేశారు. లిబియాలో సిర్తే వర్సిటీలో పనిచేయడానికి వెళ్లారు. ఆయన భార్య పిల్లలు శ్రీదేవి, విజయ్భాస్కర్, మధుసూధన్ అల్వాల్లోని సుభాష్నగర్లో నివాసముంటున్నారు.