హైదరాబాద్లో బ్లాక్ మనీ కలకలం: లక్ష్మణ రావు దారిలోనే బంగారం వ్యాపారి
తన వద్ద రూ.10వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిన హైదరాబాద్ నగర వ్యాపారి లక్ష్మణ రావుతో పాటు మరో బంగారం వ్యాపారి భక్షి తరంజిత్ సింగ్ కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు గాలిస్తున్నారు.
హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ పథకం వెల్లడి (ఐడీఎస్) కింద తన వద్ద రూ.10వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిన హైదరాబాద్ నగర వ్యాపారి లక్ష్మణ రావుతో పాటు మరో బంగారం వ్యాపారి భక్షి తరంజిత్ సింగ్ కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు గాలిస్తున్నారు.
తన వద్ద లెక్కాపత్రం లేని రూ.3వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద భక్షి తరంజిత్సింగ్ ప్రకటించారు. తరంజిత్సింగ్ తొలి విడత పన్ను చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం గాలిస్తున్నారు.
మరోవైపు, ఐడీఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న మరో వ్యాపారి లక్ష్మణ రావు. తొలి విడత పన్ను చెల్లించలేదు. ఈయన కూడా పత్తా లేకుండా పోయారు. ఈయన కోసం కూడా వేట కొనసాగుతోంది.
పోస్టాఫీసుల్లో రూ.2.95 కోట్లు పక్కదారి: ఆయనే సూత్రదారి
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద లెక్కల్లో చూపని పదివేల కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించిన బానాపురం లక్ష్మణరావుపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు బుధవారం కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్రయివేటు సంస్థలో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు చెప్పుకుంటున్న లక్ష్మణ రావు స్థిరాస్తి వ్యాపారిగా స్థిరపడ్డారు. 2008లో బిఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని ప్రారంభించారు. దానితో పాటూ పలు సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిలో డైరెక్టర్లు ఆయన కుటుంబ సభ్యులే.
రంగారెడ్డి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్టుకు సమీపంలోని దేవరంజన్ గ్రామానికి చెందిన లక్ష్మణరావు రెండేళ్ల కిందట ఫిల్మ్ నగర్ ప్రాంతంలో రూ.12కోట్లు వెచ్చించి బిల్డింగ్ కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నగరంతో పాటు ఇతరచోట్ల వెంచర్లు ఉన్నాయని సమాచారం. అధికారులు విలువైన దస్త్రాలు తీసుకెళ్లారు.