హైద్రాబాద్కు మరో ఐటీ దిగ్గజం 'యాపిల్', వెబ్సైట్లతో చేరువ.. కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాదుకు మరో ఐటీ దిగ్గజం రాబోతుంది. యాపిల్ - హైదరాబాద్లో తన కేంద్రాన్ని ఆరంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కొద్ది రోజులుగా యాపిల్ ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
వచ్చే జూన్ నుంచి తొలుత ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆరంభించాలని ఈ అమెరికా సంస్థ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలిలోని తిష్మాన్ స్పేయర్ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో 2.5లక్షల చదరపు అడుగుల స్థలంలో కేంద్రాన్ని నెలకొల్పనున్నారు.
యూరప్లోని చాలా ప్రాంతాలతో పాటు భారత్లోని ప్రధాన నగరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత చివరకు హైదరాబాద్ను ఎంచుకుందని, జూన్లో తొలుత ఇన్నోవేషన్ కేంద్రంతో ఆరంభించి, సంవత్సరాంతానికి మ్యాప్స్ విభాగాన్ని (గూగుల్ తరహాలో మ్యాప్స్ తయారు చేయనున్న యాపిల్) పూర్తిస్థాయిలో పని మొదలెడతారని, సుమారు 4500 మందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్లో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కొలువుతీరాయి. మరో మూడేళ్లలో దక్షిణాసియాలోనే అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని నిర్మించటానికి గూగుల్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, మున్సిపల్ శాఖ చేపట్టే ప్రతి పనిని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా స్పష్టమైన ఆలోచనావిధానంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్దామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ, పురపాలక - పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలను అధికారులు మాత్రమే నడుపుతున్నారనే భావన పోవాలని, పాలనా వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు.
ఇందులో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలోని 24 సర్కిళ్లలో టౌన్హాలు మీటింగులు నిర్వహించి కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల సభ్యులను ఆహ్వానించాలని, వారి సలహాలు స్వీకరించాలన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులతో నగరంలోని బుద్ధపూర్ణిమ గెస్ట్హౌస్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కెటిఆర్
అధికారమంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా అధికార వికేంద్రీకరణ జరుగాలని, అప్పుడే మెరుగైన పాలన సాధ్యమని అన్నారు. వెబ్ సైట్ల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.
కెటిఆర్
జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పురోగతికి నూతన విధానాలు అవలంబించాలని, స్థానిక సంస్థలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ రోజంతా చర్చించారు.
కెటిఆర్
బుధవారం ఉదయం 11:15 గంటల నుంచి రాత్రి 7:40 గంటల వరకు విరామం లేకుండా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజల ఆశలను వమ్ముచేయకుండా ప్రతి ఒక్క అధికారి చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని కోరారు.
కెటిఆర్
పౌరసేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరాన్ని క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్, లివబుల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకు రూపొందించే పథకాలన్నింటిలో నగర ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలని సూచించారు.
కెటిఆర్
మై హైదరాబాద్, మై జీహెచ్ఎంసీ వంటి పేర్లతో వెబ్సైట్లను రూపొందించాలని, ఇందులో ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత చేరువ అయ్యే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
కెటిఆర్
నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. స్వల్పకాల ప్రణాళికలో భాగంగా 100రోజుల్లో పూర్తిచేసే పనులు, మూడేండ్లలోపు పూర్తయ్యే పనులను మధ్యకాల ప్రణాళికలో చేర్చాలని, ఐదు నుంచి పదేళ్లలో పూర్తయ్యే పనులను దీర్ఘకాల ప్రణాళికలో చేర్చాలని సూచించారు.