చంద్రబాబు చెప్తే బిజెపిలో చేరా, నోటి దురుసుతో ఓడాను: జగ్గారెడ్డి ట్విస్ట్, కెసిఆర్ అంతు చూస్తాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాకే తాను భారతీయ జనతా పార్టీలో చేరానని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నోటి దురుసు, ఉద్యోగుల వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
జగ్గారెడ్డి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ గుండెలు అదిరేలా మేం ఇక నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డికి రావాలంటేనే మంత్రులు ఆలోచించేలా చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ అంతు చూస్తామన్నారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బిజెపిలోకి ఎందుకు వెళ్లానో తనకే తెలియదని, చంద్రబాబు ఫోన్ చేశాకే వెళ్లానని చెప్పారు. 2019లో సంగారెడ్డి ప్రజలు నన్నే గెలిపించుకుంటారన్నారు.
బిజెపిలో చేరితో భవిష్యత్ ఉందని చెప్పడంతో తాను తొందరపడ్డానని జగ్గారెడ్డి అన్నారు. కెసిఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జగ్గారెడ్డికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రాజెక్టులను పూర్తి చేయాలి: కిషన్ రెడ్డి
తెలంగాణలోని పెండింగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో కిషన్ రెడ్డి, బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు పనులు జరగడం లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.35వేల కోట్లు ఖర్చు చేస్తామన్న కెసిఆర్.. పెండింగు ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా అన్నారు. అవి ఇస్తే ఎన్నో ఎకరాలకు నీరు అందుతుందన్నారు. నూతన మద్యం విధానం ప్రమాదకరమైనదన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.