సోనియాకు జగ్గారెడ్డి సారీ, బాబు ఇలాగే లాక్కున్నారు: కెసిఆర్పై కోమటిరెడ్డి
హైదరాబాద్/ఢిల్లీ: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గురువారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపిలో చేరడం తప్పిదమేనని అన్నారు.
జగ్గారెడ్డి గురువారం నాడు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. తాను బిజెపిలో చేరడం తొందరపాటు అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.
కెసిఆర్ పైన మండిపడ్డ డిగ్గీ
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నిజాంను తలపిస్తోందని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఆయన మరో నిజాంలా వ్యవహరిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎశ్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. జగ్గారెడ్డిని తిరిగి చేర్చుకునేందుకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు అంగీకరించారని చెప్పారు.
చంద్రబాబు పాలన తలపిస్తోంది: కెసిఆర్పై కోమటిరెడ్డి
కెసిఆర్ నాటి చంద్రబాబు పాలనను తలపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని నానా విధాలుగా వేధిస్తోందన్నారు.
కరెంటు బిల్లులను చెల్లించలేదనే సాకు చూపి, రైతుల మోటార్లను, స్టార్టర్లను లాక్కుంటున్నారనన్నారు. గతంలో చంద్రబాబు రైతులను ఇదే విధంగా వేధించారని, కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందన్నారు. రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలన్నారు.
ఎల్లారెడ్డిలో వివిధ పార్టీలకు చెందిన నేతల అరెస్ట్
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం వివిధ పార్టీల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి భూములు ఆక్రమించారంటూ పలు పార్టీలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. సీపీఎం, సీపీఐ, బిజెపి, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.