ఎయిడ్స్ దాచి పెళ్లాడిన భర్తకు జైలు, అత్తకు కూడా
హైదరాబాద్: తనకు ఎయిడ్స్ ఉన్న విషయాన్ని దాచి పెట్టి పెల్లి చేసుకోవడంతో పాటు మానసిక వేదనకు గురి చేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తున్న ఓ వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ విషయాలు తెలిసినా వెల్లడించని తల్లికి కూడా కోర్టు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
భర్తకు, అతని తల్లికి నాలుగేళ్ల జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ 15వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళను 2001 మే నెలలో ఎయిడ్స్ ఉన్న విషయం దాచి నిందితుడు పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో ఒక ప్లాటు, రూ.5 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత నిందితుడికి ఉన్న రక్తగాయాలను గుర్తించిన భార్య ఆరా తీస్తే వేడివల్ల ఏర్పడ్డాయని అత్త తెలిపింది. ఆషాడ మాసంలో భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెకు జ్వరం వచ్చింది.
దీంతో భార్య తన భర్తను డాక్టరు వద్దకు తీసుకు వెళ్లారు. హెచ్ఐవీ పరీక్షలు చేయిస్తే ఎయిడ్స్ ఉన్న విషయం బయటపడింది. ఆ తర్వాత భర్త ఆమెను మానసికంగా వేధించాడు. వైద్యం కోసం డబ్బులు తేవాలని డిమాండ్ చేసేవాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది.