భార్యతో భత్కల్ జైలు ఫోన్లోనే మాట్లాడుతాడు, చూస్తున్నాం: జైళ్ల శాఖ డిజి
హైదరాబాద్: దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన భత్కల్ సెల్ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను జైళ్ల శఆఖ డిజి వికె సింగ్ ఖండించారు. యాసిన్ భత్కల్ జైలు నుంచి పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని వచ్చిన వార్తలపై ఆయన శనివారంనాడు స్పందించారు.
భత్కల్ చేతికి సెల్ఫోన్ చేరడం ఆసాధ్యమని, అందువల్ల అతను సెల్ఫోన్లో మాట్లాడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. భత్కల్ భద్రత కోసం జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జైలులో ఉన్న ప్రతి ఖైదీకి జైలు ఫోన్ ద్వారా వారానికి రెండు నెంబర్లకు మాట్లాడుకునే వెసులుబాటు ఉందని ఆయన చెప్పారు.
ఖైదీలు ఇద్దరి బంధువుల నెంబర్లు ముందే రిజిష్టర్ చేస్తారని, భత్కల్ కూడా తన భార్య నెంబర్ రిజిష్టర్ చేస్తున్నాడని, తన భార్య జహీదాతో ప్రతి వారం మాట్లాడుతాడని ఆయన చెప్పారు. ఖైదీలు మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ కూడా రికార్డు అవుతుందని స్పష్టం చేశారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్స్ను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
అయితే, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి భత్కల్ మాట్లాడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యుడు, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జైలు నుంచి పారిపోయి వస్తానంటూ బంధువులు, స్నేహితులకు భత్కల్ ఫోన్లు చేసినట్లు అధికారులు గుర్తించారని ఊహాగానాలు చెలరేగాయి.