మోడీ చేతిలోనో సుప్రీంలోనో సమాధి: కేసీఆర్ ముస్లీం బిల్లుపై జైపాల్, అద్వానీకి తెలియకుండా..
బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత జరగదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బుధవారం అన్నారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత జరగదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బుధవారం అన్నారు.
తాను 2002లోనే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని తదితరులను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశానని చెప్పారు. ఆ టీంలో మోడీ ఉన్నారని, ఈ కేసులో మోడీని కూడా చేర్చాలన్నారు.
సుప్రీం షాక్: బాబ్రీ కుట్ర కేసులో అద్వానీకి ఎదురు దెబ్బ, కళ్యాణ్ సింగ్కు మినహాయింపు
ముస్లీం రిజర్వేషన్ బిల్లు చిత్ర, విచిత్రమైన బిల్లు అని జైపాల్ రెడ్డి అన్నారు. అది మోసపూరిత, లోపభూయిష్టమైన బిల్లు అన్నారు. ఈ బిల్లు మోడీ చేతిలో ఉంటుందని చెప్పారు. మోడీ చేతిలో లేదా కోర్టు చేతిలో ఈ బిల్లు సమాధి కావాల్సిందే అన్నారు. ఉత్తరాదిన వెనుకబడిన ముస్లీంలకు రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.
ముస్లీం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే మరో మూడేళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. గిరిజన, ముస్లీంల రిజర్వేషన్లను కలిపి ఒకే బిల్లు తేవడం అంటే రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసే పరిస్థితి అని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ జాతులలో ఒక్క కులాన్ని కలపాలన్నా పార్లమెంటు ఆమోదం కావాలన్నారు.