మద్యం మత్తులో తమ్ముడిని గొడ్డలితో నరికి హత్య
మద్యం మత్తులో తండ్రి, సోదరుడిపై దాడి చేసిన ఘటనలో జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని హన్మండ్లపల్లికి చెందిన మాశెట్టి మధు (21) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు.
జమ్మికుంట: మద్యం మత్తులో తండ్రి, సోదరుడిపై దాడి చేసిన ఘటనలో జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని హన్మండ్లపల్లికి చెందిన మాశెట్టి మధు (21) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి తండ్రి భిక్షపతి, స్థానిక సీఐ పి.ప్రశాంత్రెడ్డిల కథనం ప్రకారం.. హన్మండ్లపల్లికి చెందిన భిక్షపతి హమాలీ కార్మికుడు.
ఇతనికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజీవ్ హమాలీగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు మధు పదో తరగతి వరకు చదివి మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తండ్రిని, సోదరుడ్ని డబ్బుల కోసం వేదించేవాడు. ప్రతిరోజు డబ్బులు అడగటమే గొడవకు దారి తీసింది.
ఆదివారం రాత్రి సైతం డబ్బులు అడగడంతో ఇవ్వమని వారు స్పష్టం చేశారు. దీంతో మధు తండ్రి, సోదరుడు సంజీవ్పై గొడ్డలితో దాడికి దిగాడు. ఈ దాడిలో సంజీవ్ గొడ్డలి లాక్కొని మధు తలపై బాదడంతో అక్కడ్కిక్కడే మృతి చెందాడు.
మద్యానికి బానిసై చిన్న కుమారుడు ఏ పని చేయకుండా డబ్బులు డిమాండు చేసేవాడని తండ్రి భిక్షపతి తెలిపారు. ఏడాదిన్నర కిందట భిక్షపతి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.