ఉత్తమ్ ఎఫెక్ట్: జానారెడ్డి పదవికి ఎసరు?
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించి పొన్నాల లక్ష్మయ్యకు షాక్ ఇచ్చినట్లుగానే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నేతగా కొనసాగుతున్న కుందూరు జానారెడ్డికి కూడా కాంగ్రెసు అధిష్టానం షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించడంతో జానా రెడ్డిని మార్చక తప్పని పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది.
ఇప్పటి వరకు బిసి వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య పార్టీ నాయకత్వం వహిస్తుండగా, జానా రెడ్డి సిఎల్పీ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే, పొన్నాలను తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా నియమించడంతో జానా రెడ్డిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకే వర్గానికి చెందిన నాయకులకు రెండు పదవులు ఉండడం అంత సమయోచితంగా ఉండదనే భావనతోనే కాకుండా బిసీలు, ఇతర దిగువ వర్గాలకు చెందిన నాయకులను కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది. దానికితోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానా రెడ్డి కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఈ రీత్యా కూడా జానా రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది.
తాజా పరిణామాల నేపథ్యంలో జానా రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. ఆయనకు నచ్చజెప్పి సిఎల్పీ నేతగా మరొకరిని ఎంపిక చేసే పనిలో కాంగ్రెసు అధిష్టానం పడింది. జానారెడ్డికి ఏ విధంగానైనా నచ్చజెప్పాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జానారెడ్డి స్థానంలో మరో సామాజిక వర్గానికి చెందిన నేతను సిఎల్పీ నేతగా ఎంపిక చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా పొన్నాల లక్ష్మయ్యపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఆయన అందరినీ కలుపుకుని పోవడం విఫలమవుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. దీంతో ఆయనను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.