కేశవరావుతో జానా భేటీ: మతలబు ఏమిటి?
హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానా రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సీనియర్ నాయకుడు కె కేశవ రావును బుధవారం ఉదయం కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన కేశవరావును కలిసినట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెసులో ఉన్న కేశవరావుతో జానారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సంబంధాలు ఈ సందర్భంగా ఉపయోగపడుతాయని భావించి ఉండవచ్చునంటున్నారు.
టిఆర్ఎస్ ఐదో ఎమ్మెల్సీ సీటుపై కూడా కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఐదో సీటుకు పెట్టకూడదని చెప్పడానికి జానా రెడ్డి కేశవరావును కలిశారా, మరేదైనా కారణం ఉందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. తాము గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు కాంగ్రెసు అధిష్టానం బుధవారం సాయంత్రం అభ్యర్థిని ప్రకటించనుంది.
ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం దాదాపు 40 మంది కాంగ్రెసు నాయకులు పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఒక్క సీటు కోసం సీనియర్లూ జూనియర్లూ కాంగ్రెసు అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారు. అభ్యర్థి ఎంపిక బాధ్యత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకుంటారని అంటున్నారు. అయితే, యువ నేత రాజీవ్ గాంధీ జోక్యం చేసుకుంటే జూనియర్లకు కూడా అవకాసం ఉండవచ్చునని అంటున్నారు
అభ్యర్థి ఎంపికపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు బుధవారంనాడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ, జానా రెడ్డితోనూ మాట్లాడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జానా రెడ్డి కేశవరావును కలిశారని అంటున్నారు.