కెసిఆర్ వచ్చినా ఆహ్వానిస్తా: జానా భగ్గు, డిఎస్ చేరికపై విహెచ్ సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో తాను సన్నిహితంగా ఉంటున్నానని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి భగ్గుమన్నారు. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపరేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర గవర్నర్ రాసిన పుస్తకం ఆవిష్కరణకు అతిథిగా తనను పిలవటానికి టిఆర్ఎస్ ఎంపి వినోద్, ఆయన సోదరుడు కలిసి ఆహ్వాన పత్రిక తీసుకుని తమ ఇంటికి వచ్చి వెళ్లారని తెలిపారు. దానికి ఇంత రాద్దాంతం చేశారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధి అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన ఇంటికి వచ్చినా ఆహ్వానిస్తానని జానారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే తాను ఇతర పార్టీల నాయకులతో వ్యవహరిస్తానని జానారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఇది ఒక వార్తనా అంటూ మీడియాపై మండిపడ్డారు.
తమ పార్టీకి రాజీనామా చేసి, డి శ్రీనివాస్ టిఆర్ఎస్లో చేరడంపై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. డిఎస్ పార్టీని వీడితే నష్టమేమీ లేదని అన్నారు. టిఆర్ఎస్లో ఆహ్వానం అదిరేలా ఉంటుందని, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత తీసిన ర్యాలీపై కూడా హనుమంతరావు స్పందించారు. నిందితులు బెయిల్ షరతులలో ర్యాలీలు, ప్రసంగాలు చేయవద్దని కూడా నిబంధనలు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆయన ఆ విధంగా అన్నారు. కేసు నుంచి నిర్దోషిగా బయటపడినప్పుడు మాత్రమే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని ఆయన అన్నారు.
కాగితాలకే పరిమితమని కిషన్ రెడ్డి
పుష్కరాల ఏర్పాట్లు కాగితాలకే పరిమితమయ్యాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. రూ.600 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు.
కేంద్రం 50 కోట్లు ఇచ్చిందని, మరో 50 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. కేంద్రంతో మాట్లాడి ఐఐటీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో నమ్మకపోయిందని, డీఎస్ రాజీనామే దీనికి నిదర్శనమని బీజేపీ నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్ విమర్శించారు.