అరెస్టులకు బెదిరేది లేదు, బాధితులను పరామర్శించడం తప్పా? : జానారెడ్డి ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అస్థిరపరిచాలనే దురుద్దేశంతోనే టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు సీఎల్పీ నేత జానారెడ్డి. లాఠీ దెబ్బలకు బలైన నిర్వాసిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న నేతలను అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యకు నిదర్శనమన్నారు జానారెడ్డి.
కాంగ్రెస్ నేతల అరెస్టులపై గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు జానారెడ్డి. బాధితులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ వద్దే ప్రభుత్వం అరెస్టు చేయించడం దారుణమన్న ఆయన.. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అదిరేది లేదు, బెదిరేది లేదని తేల్చి చెప్పారు.
బాధితులను పరామర్శించడం తప్పా..? అని ప్రభుత్వాన్ని నిలదీసిన జానారెడ్డి, వేముల ఘాట్ బాధితులను పరామర్శించడానికి వెళితే.. శాంతి భద్రతలకు విఘాతమేమి కలగదన్నారు.ప్రతిపక్షాల ప్రజాస్వామ్యయుత కార్యక్రమాలను ప్రభుత్వం గౌరవించాలని పేర్కొన్న జానారెడ్డి, మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వ్యవహారం సరైన పంథాలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.