సికింద్రాబాద్లో శశికళ ఇల్లు ఇదే: చెల్లించని పన్ను ఇంత!
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం వెస్ట్ మారేడుపల్లి రోడ్డులోని రాధికా కాలనీలో ఓ ఇల్లు(ప్లాట్ నెం. 16జీ/ఎఫ్) ఉంది.
సికింద్రాబాద్: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం వెస్ట్ మారేడుపల్లి రోడ్డులోని రాధికా కాలనీలో ఓ ఇల్లు(ప్లాట్ నెం. 16జీ/ఎఫ్) ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శశికళ బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయి.. పరప్పన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
కాగా, సికింద్రాబాద్లోని ఆ ఇల్లు శశికళ నటరాజన్ పేరిటే ఉంది. అయితే, గత రెండేళ్లుగా రూ.35,424 ఆస్తి పన్ను బోర్డుకు చెల్లించాల్సి ఉందని పన్ను విభాగం సూపరింటెండెంట్ యానీ పేర్కొన్నారు. శశికళ 1990లో ఈ కాలనీలో రెండు డూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేయగా, ఒకదానిని కొన్నేళ్ల క్రితం విక్రయించారు.
ప్రస్తుతం ప్లాట్ నెంబరు 16లో శశికళ పేరిట ఉన్న ఇంటిలో మూడేళ్ల క్రితం వరకు అబ్రహం అనే వ్యక్తి కుటుంబసభ్యులతో ఉండేవారని స్థానికులు పేర్కొంటున్నారు. మూడు నెలల క్రితం ఈ ఇంటి కేర్ టేకర్గా ఉన్న శశికళకు సంబంధించిన ఓ వ్యక్తి మరమ్మతులు చేయించి రంగులు వేయించి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. శశికళ ఇక్కడికి వచ్చిన దాఖలాలైతే లేవని వారంటున్నారు.
ఇది ఇలా ఉండగా, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా హైదరాబాద్ లో ఆస్తులున్నాయి. జేజే గార్డెన్ పేరిట ఆమెకు జీడిమెట్లలో ఓ ఎస్టేట్ ఉంది. ఎస్టేట్కు జయ తల్లి సంధ్య(వేధ) పేరు కూడా ఉంది. ఇందులో 14.50ఎకరాల్లో ద్రాక్ష తోట కూడా ఉంది. ఆ తర్వాత 3.33ఎకరాలను అదనంగా ఆమె దక్కించుకున్నారు.