ఝాన్సీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్: భర్తపై ఫిర్యాదు చేస్తూ కెసిఆర్కు లేఖ
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో బిటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె మృతిపై పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల క్రితం మరణించిన ఝాన్సీ తన తల్లిపై, భర్తపై ఫిర్యాదు చేస్తూ ఆమె రాసిన సూసైడ్ లేఖ ఆలస్యంగా వెలుగు చూసింది.
తనను వ్యభిచారంలోకి దించేందుకు భర్తతో పాటు తల్లి కూడా ప్రయత్నించారని ఆమె ఆ లేఖలో ఆరోపించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, డిజిపికి, జిల్లా ఎస్పీకి, నకిరేకల్ పోలీసులకు తాను చనిపోయే ముందు ఆ సూసైడ్ లేఖను పంపించిదంి. దీంతో ఝాన్సీ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఝాన్సీ ఆత్మహత్య కేసులో తల్లి పద్మ, భర్త విజేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 306, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేక ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తల్లి పద్మ పోలీసుల విచారణలో చెప్పింది.
ఝాన్సీని సొంత మేనత్త కొడుక్కే ఇచ్చి పెళ్లి చేశామని తల్లి పద్మ తెలిపింది. కాలేజీలో సందీప్ అనే యువకుడిని ఝాన్సీ ప్రేమించిందని తల్లి పద్మ చెప్పారు. ఈనెల 24న ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సీఐకి తమ్ముడు తెలిపాడు. ఝాన్సీ మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది.