ఏపి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు: వెంకయ్యపై జితేందర్, అన్యాయం చేశారన్న షబ్బీర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్ర మంత్రిననే విషయాన్ని మరిచి ఏపీ రాష్ర్టానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ బృందాన్ని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడటంపై మండిపడ్డారు.
ఇంటికి పిలిపించి ఏపీకి చెందిన అంశాలపై చర్చించడాన్ని టిఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. గత 60 ఏళ్లుగా దోపిడికి గురైనందునే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిఎం కెసిఆర్ ఉద్యమించారని గుర్తు చేశారు.
వెంకయ్యనాయుడు తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా విభజనతో ఏపీ నష్టపోయినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాల అమలుపై సమీక్షించాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాకు ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు.
స్మార్ట్ సిటీల ఎంపికలో తెలంగాణకు అన్యాయం
రాష్ట్రం నుంచి కేవలం రెండు నగరాలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఆరోపించారు.
కేంద్రప్రభుత్వం గురువారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్మార్ట్సిటీల జాబితాలో రాష్ట్రం నుంచి కేవలం రెండే నగరాలను ఎంపిక చేయడం చూస్తుంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానికి ఏ మేరకు చిత్త శుద్ధి ఉందో స్పష్టమవుతోందని అన్నారు.
తన సొంత రాష్ట్రమైన ఏపీ నుంచి మూడు నగరాలను వెంకయ్యనాయుడు ఎంపిక చేయడాన్ని తప్పుపట్టారు. బిజెపి పాలిత రాష్ర్టాలలో ఎక్కువ నగరాలను కేంద్రం స్మార్ట్ సిటీల జాబితాలో ఎంపిక చేసిందని, తెలంగాణలోని మిగతా నగరాలు, పట్టణాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణపై శీతకన్ను వేశారని శాసన మండలిలో కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి విపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిఎం కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు.