హైద్రాబాద్, కొడంగల్ విడవొద్దు: రేవంత్కు బెయిల్, సంబరాల్లో అనుచరులు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ పిటిషన్ పైన మంగళవారం నాడు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు రేవంత్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కొడంగల్, హైదరాబాద్లకే పరిమితం.. షరతులతో బెయిల్
రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. అలాగే, పాస్పోర్టును సరెండర్ చేయాలని ఆదేశించింది. కొడంగల్, హైదరాబాదులకే పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది. రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు బెయిల్ వచ్చింది. రేవంత్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాన్న తెలంగాణ ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. మత్తయ్యను పరారీలో ఉన్నాడని చెప్పలేమన్నారు.
న్యాయస్థానం ఏం చెప్పింది?
రేవంత్ రెడ్డి బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న తెలంగాణ ఏజీ రామకృష్ణా రెడ్డి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. విచారణ సంస్థలు విచారణ విషయం చూసుకుంటాయని చెప్పింది. ఇప్పటికే నాలుగు రోజులు రేవంత్ను కస్టడీలోకి తీసుకున్నారని హైకోర్టు గుర్తు చేసింది. షరతులను పాటించకుంటే బెయిల్ రద్దు చేస్తామని చెప్పింది.
అంతకుముందు తెలంగాణ ఏజీ కోర్టుకు లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించింది. రేవంత్కు బెయిల్ ఇవ్వవద్దని కోరింది. బెయిల్ వస్తే కేసును తారుమారు చేస్తారని తెలంగాణ ఏజీ రామకృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసు విచారణలో ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డికి పలుకుబడి ఉందని, ఇది చాలా తీవ్రమైన కేసు అని చెప్పారు. ఈ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య తప్పించుకు తిరుగుతున్నాడని ఏజీ చెప్పారు. రూ.4.5 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో తేలాల్సి ఉందన్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు వచ్చాక మరికొంతమందిని విచారించవలసి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డికి పలుకుబడి ఉందని, దాంతో సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పారు. కాగా, రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
బెయిల్ తీర్పు నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, రేవంత్ అభిమానులు, లాయర్లు, మీడియా ప్రతినిధులతో కోర్టు నిండిపోయింది. న్యాయమూర్తి రాజా ఇళంగో పదిన్నర గంటల సమయంలో కోర్టు హాలుకు వచ్చారు.