మోడీ కల-క్యాష్ లెస్ తెలంగాణ: కేసీఆర్కు పెద్ద సవాలే, ఎన్నో చిక్కులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాష్ లెస్ తెలంగాణను కోరుకుంటున్నారని, కానీ అది అంత సులభం కాదని చెబుతున్నారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో క్యాష్ లెస్ కంట్రీ వైపు నడిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకు రాష్ట్రాలు కూడా సహకరించాలని కోరుతున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నుంచి మద్దతు లభించింది.
తెలంగాణను 'క్యాష్ లెస్ తెలంగాణ'గా మార్చాలని భావిస్తున్నారు. అయితే అది అంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు రోజుల క్రితం జరిగిన భేటీలో అధికారులు తెలిపారని తెలుస్తోంది.
రాష్ట్రంలో కోటి వరకు కుటుంబాలు ఉంటే అందులో సగం కుటుంబాలలోని పెద్దలకు, ఇతరులకు చదువు రాదని అదికారులు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు (క్యాష్ లెస్) తీసుకునే ముందు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు ఆలోచించాలని చెప్పారని తెలుస్తోంది.
సూచించా, రూ.2వేలు రద్దవొచ్చు, మోడీ శిక్షకు సిద్ధమన్నారు: కేసీఆర్, గాలి కూతురు పెళ్లిపై
లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చాలామందికి చదువు రాదని, ముఖ్యంగా కుటుంబ పెద్దలకు చదువు రాదని చెబుతున్నారు. ఇలాంటప్పుడు క్యాష్ లెస్ అంటే వారిని మోసగించే అవకాశాలు లేకపోలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల ఈ-పోస్లు ఉన్నాయని, అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి కేవలం 1200 మాత్రమేనని చెప్పారు. మరో యాభై లక్షల ఈ పోస్ మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రావాల్సి ఉంటుందని, వాటిని చైనా నుంచి తీసుకు రావాలని చెప్పారు.
భారత దేశంలో కేవలం 2 శాతం మంది మాత్రమే నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారని, మిగతా 98 శాతం క్యాష్ మంది ట్రాన్సాక్షన్లనే ఉపయోగిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ విషయానికి వస్తే మొత్తంగా 25 శాతం మందికి బ్యాంకు అకౌంట్ లేదని, గ్రామీణ ప్రాంతాలోని వారికి అయితే 70 శాతం మందికి లేదని చెప్పారు. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పిన్ నెంబర్ వంటివి ఎన్నో ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవి ఇబ్బందికరంగా మారుతాయని చెప్పారు.
అంతేకాకుండా, సైబర్ క్రిమినల్స్ కారణంగా చాలా కంపెనీలు నెట్ బ్యాకింగ్కు దూరం జరుగుతున్నాయని చెప్పారు. ఆన్ లైన్ బ్యాకింగ్ అకౌంట్స్ వల్ల హ్యాకింగ్కు ఎక్కువ అవకాశాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికారులు తెలిపారు.
తెలంగాణలో నిరక్షరాస్యత 67 శాతంగా ఉందని, అక్షరాస్యతను పెంచకుండా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అంటే చాలా ఇబ్బంది అని, అది కుదిరే పని కాదని చెప్పారని తెలుస్తోంది. చదువు రాని వారు ఉపయోగించలేరని, వారు ఇతరుల పైన ఆధారపడితే మిస్ యూజ్ అయ్యే అవకాశాలున్నాయన్నారు.