ఆసక్తికర చర్చ: సీఎం కేసీఆర్ను తాకిన రజనీ 'కబాలి' మానియా
హైదరాబాద్: జులై 22 (శుక్రవారం) తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం 'కబాలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు రజనీకాంత్ నటించిన గత సినిమాల కన్నా విపరీతమైన పబ్లిసిటీని సినిమా నిర్మాతలు కల్పించారు. సినిమా విడుదలకు ముందు భూమి నుంచి ఆకాశం వరకు ఎక్కడ చూసిని కబాలి మానియానే.
ఎయిర్ ఏషియా సంస్ధ అయితే ఏకంగా విమానంపైనే కబాలి పోస్టర్లను అంటించి అభిమానులకు ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు రజనీ కబాలి మానియా రాజకీయ నాయకులకు కూడా పాకింది. కబాలి విడుదలకు ముందే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇందులో భాగంగా రజనీకాంత్ కబాలి సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను ప్లెక్సీలో వేశారు. ఆ ప్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. ప్లెక్సీలో ఇండియాలో నంబర్ వన్ సూపర్స్టార్ రజినీకాంత్ అని పేర్కొన్న అభిమానులు ఆ పక్కనే ఇండియాలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అంటూ పెట్టారు.
రజినీకాంత్ పోస్టర్ పక్కనే కేసీఆర్ ఫోటోను పెట్టిన ఆయన అభిమానులు వేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ ప్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ప్లెక్సీని చూసిన టీఆర్ఎస్ శ్రేణులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇంతకీ ఈ ప్లెక్సీ ఎక్కడ పెట్టారో తెలుసా ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో.