తెలుగు మాస్టారైన కడియం: అరగంట పాఠాలు బోధించి రూ. లక్ష ఆర్జన
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధించారు. చందస్సు, వ్యాకరణం, సంధులు, పదాల మధ్య అంతరాలు, అర్థాలను విద్యార్థులకు వివరించారు. ఓరుగల్లులో ఏప్రిల్ 27న నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్
వరంగల్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధించారు. చందస్సు, వ్యాకరణం, సంధులు, పదాల మధ్య అంతరాలు, అర్థాలను విద్యార్థులకు వివరించారు. ఓరుగల్లులో ఏప్రిల్ 27న నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం నిధుల సమీకరణలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేటరోడ్లోని ఒయాసిస్ పాఠశాలలో బుధవారం తెలుగు మాస్టారుగా అవతారమెత్తారు.
దాదాపు అరగంట పాటు పాఠాలు చెప్పి రూ.లక్ష నిధులు సేకరించారు. రాజకీయాల్లోకి రాక ముందు రసాయన శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేసిన కడియం ఆనాటి మధురస్మృతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు వచ్చేవారి రవాణా ఖర్చులు, తాగునీరు, మజ్జిగ పంపిణీ కోసం పాఠశాల నిర్వాహకుడు డాక్టర్ జేఎస్ పరంజ్యోతి ఇచ్చిన రూ.లక్షను వ్యయం చేస్తామని ప్రకటించారు.
దాదాపు 40 ఏళ్ల క్రితం తాను నేర్చుకున్న పాఠాలను బోధించాల్సి వచ్చిందన్నారు. అప్పటితో పోల్చితే ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ఫాస్ట్గా ఉన్నారని కితాబిచ్చారు. ఏయే పాఠాలు బోధించాలో ముందుగా నిర్ణయించుకుని కాస్త సిద్ధమై వచ్చానన్నారు. పదాలను స్పష్టంగా ఉచ్చరించడం, మధ్యలో విద్యార్థులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టిన విధానం అందరినీ ఆకట్టుకుంది.