పిచ్చికూతలు: మోత్కుపల్లిపై కడియం ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం కావడం నచ్చకే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కొందరు తప్పుమనుషులు.. తప్పుడు కూతలు కూస్తున్నారని మోత్కుపల్లిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను చిత్తశుద్ధితో పని చేసే వ్యక్తి అని, తాను తప్పు చేస్తే వ్యక్తిని కాదని చెప్పిన కడియం శ్రీహరి... తాను తప్పు చేస్తే ఉరి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు.
తాను మాదిగ ఉప కులానికి చెందిన వ్యక్తినని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందనే అసూయతోనే కొందరు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కడియం అన్నారు. కాగా, కడియం శ్రీహరి ఎన్నికల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ మోత్కుపల్లి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపైనే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు మనుషులే ఇలాంటి తప్పుడు కూతలు కూస్తారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సిఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో కడియం శ్రీహరిని తెలంగాణ సిఎంగా నియమించిన విషయం తెలిసిందే.