ఏపీ మాకు అప్పగించాలి, చంద్రబాబు అక్కడ చెప్పారని తెలిసింది: కడియం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాలన ఏపీకి తరలిపోయినందున, హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలు, సచివాలయం, బ్లాక్స్, ఇతర కార్యాలయాలను అన్నింటిని తెలంగాణకే ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశామని, దానిని గవర్నర్కు పంపిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం చెప్పారు.
తెలంగాణ కేబినెట్ ఈ రోజు నాలుగు గంటల పాటు సమావేశమైంది. సమావేశం అనంతరం కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు తదితరులు కేబినెట్ భేటీలో చర్చించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం పాలన అంతా అమరావతి నుంచి జరుగుతోందని అభిప్రాయపడ్డారు. వారు వెళ్లినందున హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటం కంటే తెలంగాణకు ఇస్తే బాగుంటుందన్నారు. ఈ తీర్మానాన్ని పంపిస్తామని చెప్పారు.
బ్రిజేష్ ట్రైబ్యునల్ పైన సబ్ కమిటీ
కృష్ణా జలాల పైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు పైన సుదీర్ఘంగా చర్చించామన్నారు. వీటిపై లోతుగా అధ్యయనం చేసేందుకు మంత్రి హరీష్ రావు నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారని చెప్పారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు పైన ఎలా ముందుకేళ్లాలో ఈ సబ్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు.
కొన్ని జిల్లాల మార్పుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కుమరం భీమ్ అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల జిల్లాలుగా మార్చినట్లు తెలిపారు.
మహిళా ఉద్యోగులకు 90 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తామని చెప్పారు. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ లీవ్ ఎప్పుడైనా తీసుకోవచ్చునని చెప్పారు. ఆరు దఫాలుగా ఈ సెలవులు తీసుకోవచ్చునని కడియం శ్రీహరి చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్స్, ఆరోగ్యశ్రీ, రుణ మాఫీ పైన చర్చ జరిగిందని చెప్పారు.
చంద్రబాబు చెప్పినట్లుగా తెలిసింది
ఈ రోజే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాలని మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయన్నారు. తాము కూడా అదే అడుగుతున్నామన్నారు. ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన భవనాలు వారు ఉపయోగించుకోవడం లేదని, వాటిని తమకు ఇవ్వాలని తీర్మానం చేశామని చెప్పారు.