కడియం, తలసాని భయపడుతున్నారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే.. వరంగల్ ఎంపి పదవికి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పదవికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసేందుకు భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది నెలల సమయంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దీంతో ఉప ఎన్నికలకు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి భయపడుతోందని అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు.
రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు ఆగ్రహం
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు అయ్యారు. ఏప్రిల్ 21న రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
కాగా. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సిఎం కెసిఆర్ తోపాటు మరి కొంతమందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.